కరోనా వ్యాక్సిన్ టీకాలు 60 ఏళ్ళకు పైబడిన సామాన్యులకు, 45 ఏళ్ళ పైబడిన దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న 45 ఏళ్ళ వయస్కులతో పాటు 60 ఏళ్ల వయసు, 60 వయసు పైబడిన సామాన్య ప్రజలకు ప్రైవేటు ఆసుపత్రులలో రూ.300-400 కి వ్యాక్సిన్ అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు సమాచారం.మార్చి 1వ తేదీ నుంచి సామాన్య ప్రజలకు కొవిడ్ -19 టీకా అందజేసేందుకు 10 వేల ప్రభుత్వ ఆసుపత్రులకు, 20 వేల ప్రైవేట్ ఆసుపత్రులకు ఇప్పటికే సరిపడా వ్యాక్సిన్లను కేంద్ర ప్రభుత్వం సరఫరా చేసిందని సమాచారం.
అయితే ప్రభుత్వ ఆస్పత్రులలో ఉచితంగానే కొవిడ్ వ్యాక్సిన్ అందించనున్నామని కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ తెలిపారు.
ఫ్రంట్లైన్ వారియర్స్ కి మొదటి దశలో కరోనా టీకాలు అందించిన భారత ప్రభుత్వం ఇప్పుడు పోలీసులకు, పారిశుద్ధ్య కార్మికులకు టీకాలు అందజేస్తోంది.
ఇకపై రెండవ దశలో 27 కోట్ల సామాన్య ప్రజలకు టీకా అందుబాటులోకి తేవాలని కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకోవడం తో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.కరోనా మహమ్మారిని శాశ్వతంగా నిర్మూలించే దిశగా కేంద్ర ప్రభుత్వం శరవేగంగా ముందడుగులు వేయటం నిజంగా ప్రశంసనీయం.
ఇప్పటివరకు ఒక కోటి 21 లక్షల పైచిలుకు ప్రజలకు కరోనా వ్యాక్సిన్ మొదటి డోసు అందిందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.అయితే వీరిలో కోటి 7 లక్షల మంది ఆరోగ్య సిబ్బంది, ఫ్రంట్లైన్ వారియర్స్ ఉన్నారని తెలిపింది.
మొదటి డోసు అందించిన 28 రోజుల తర్వాత రెండవ డోసు అందిస్తున్నారు.
ఇకపోతే 45 ఏళ్ల వయసు కలిగిన ప్రజలు కరోనా వ్యాక్సిన్ పొందాలంటే వారికి దీర్ఘకాలిక హృదయ సంబంధిత వ్యాధులు ఉండాలి.ఊపిరితిత్తులు, కాలేయం, మూత్రపిండాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు కూడా కరోనా వ్యాక్సిన్ పొందొచ్చు.రెండో దశలో డయాబెటిస్, ఆస్తమా, క్యాన్సర్ రోగులు కూడా కరోనా టీకా వేయించుకోవచ్చు.
అయితే వ్యాధులు ఉన్నట్టు డాక్టర్ నిర్ధారించిన ఒక సర్టిఫికెట్ తీసుకొని ఆ సర్టిఫికేట్ ని వ్యాక్సినేషన్ సెంటర్ లో ఇచ్చి టీకా పొందొచ్చు.