కరోనా భయం నుంచి జనాలు కాస్త కోలుకుంటూ సాధారణ పరిస్థితికి వచ్చేసినట్టుగా కనిపిస్తున్నారు.లాక్ డౌన్ నిబంధనల్లో సడలింపులు ఇవ్వడంతో, జనాలు స్వేచ్ఛగా రోడ్లపైకి వచ్చేస్తున్నారు.
భయం లేకుండా తిరిగేస్తున్నారు.ఇప్పటి వరకు ఓపిగ్గా ఇళ్లకే పరిమితం అయ్యేందుకు ప్రాధాన్యం ఇచ్చిన వారంతా, యధావిధిగా రోడ్లపై తిరిగేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు.
మార్చి 24 వ తేదీ నుంచి లాక్ డౌన్ నిబంధనలు అమలులో ఉండటం, ఇప్పటికీ లాక్ డౌన్ అమలు అవుతుండడంతో, భారీ ఎత్తున సడలింపులను కేంద్రం ప్రకటించింది.దేశవ్యాప్తంగా చూస్తే కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య రోజురోజుకు తీవ్రంగా పెరుగుతున్నాయి.
రోజుకు ఆరు వేల కేసులు తక్కువ కాకుండా నమోదవుతున్నాయి.నాలుగో విడత లాక్ డౌన్ ముగిసినప్పటికీ కరోనా వైరస్ కేసుల సంఖ్య ఏమాత్రం తగ్గడం లేదు.
ఇప్పటికే దేశవ్యాప్తంగా లక్షల్లో కేసులు నమోదయ్యాయి .దీంతో కరోనాను కేంద్రం అదుపు చేయలేకపోతుందనే ఆందోళన ప్రజల్లో పెరిగిపోతోంది.ఒక పక్క చూస్తే మహారాష్ట్రలో 50 వేల కేసులు నమోదయ్యాయి.
అలాగే తమిళనాడు, మహారాష్ట్ర, ఢిల్లీ, గుజరాత్ రాష్ట్రాల్లోనూ కేసుల సంఖ్య విపరీతంగా పెరిగాయి.
ఈ రాష్ట్రాల్లో పరిస్థితిని యథాస్థితికి తీసుకువచ్చేందుకు కేంద్రం ఎంతగా ప్రయత్నిస్తున్నా, పరిస్థితి అదుపులోకి రావడం లేదు.ప్రస్తుతం దేశ వ్యాప్తంగా వలస కార్మికుల తరలింపు పెద్ద ఎత్తున జరుగుతోంది.
దీంతో కొత్తగా వేల కేసులు నమోదవుతున్నాయి.వీటితోపాటు దేశీయ విమానాలు యథేచ్ఛగా తిరిగేందుకు అనుమతి ఇవ్వడంతో పాటు, మిషన్ వందేమాతరం కింద విదేశాల నుంచి భారతీయులను తీసుకు రావడం వంటి కారణాల వల్ల కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతూ వస్తోంది.
దీనికి తోడు రైళ్లను కూడా పునరుద్ధరించడం వంటి కారణాల వల్ల వైరస్ వ్యాప్తి విపరీతంగా పెరుగుతోంది.జూన్ నెలలో ఈ వైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉంటుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.ఒక్క నెలలోనే 15 లక్షల కేసులు దేశవ్యాప్తంగా నమోదయ్యే అవకాశం ఉన్నట్టుగా సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ బయాలజీ సంస్థ వెల్లడించింది.ప్రస్తుతం కరోనా కేసులు పట్టణాల్లో ఎక్కువగా కనిపిస్తున్నా, ఇప్పుడు వలస కార్మికులు కారణంగా గ్రామాల్లోనూ ఈ కేసుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లుగా నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఆరు నుంచి ఏడు వేల వరకు కొత్త కేసులు నమోదు అవుతుండగా, మరణాల శాతం ఇతర దేశాలతో పోలిస్తే తక్కువగా ఉండడం కాస్త ఊరటనిచ్చే అంశం.ప్రజలందరూ ఇప్పుడు మరింత అప్రమత్తతో వ్యవహరించాలని, లేకపోతే పరిస్థితిని అదుపులోకి తీసుకు రావడం ఎవరి వల్ల సాధ్యం కాదు అనేది ఇప్పుడు నిపుణులు చెబుతున్న మాట.