కరోనా పేరు వింటేనే ప్రపంచ దేశాల వెన్నులో వణుకు పుట్టుకొస్తోంది.ముఖ్యంగా అమెరికా వంటి అగ్ర రాజ్యంలో కరోనా అంటేనే భయంతో వణికిపోతున్నారు.
ఏకంగా అధ్యక్ష ఎన్నికలపైనే కరోనా ప్రభావం చూపిస్తోందంటే ఏ స్థాయిలో అమెరికాలో కరోనా వ్యాప్తి చెందిందో అర్థం చేసుకోవచ్చు.ఈ ఎన్నికల్లో అధ్యక్షుడు ట్రంప్ ఓటమి పాలైతే అది కేవలం కరోనా ప్రభావమే.
ఇదిలాఉంటే ఇప్పుడిప్పుడే కరోనా తగ్గుముఖం పడుతున్న క్రమంలో
అమెరికన్స్ అందరూ ఉలిక్కిపడేలా అమెరికాలో కరోనా మహమ్మారి మరో సారి విరుచుకు పడుతోంది.ఫస్ట్ రౌండ్ అయ్యిపోయింది.
మళ్ళీ సిద్దంగా ఉన్నాను అని పిలిచినట్టుగా కేవలం ఒక్క రోజులోనే 83 వేల కరోనా కేసులు నమోదు అయ్యాయి.కోవిడ్ ట్రాకింగ్ ప్రాజెక్ట్ తెలిపిన వివరాల ప్రకారం కేవలం ఒక్క రోజులో ఇన్ని కేసులు నమోదు కావడం అంత మంచి పరిణామం కాదని అంటున్నారు.
తగ్గినట్టే తగ్గిన మహమ్మారి రోజు రోజుకి విరుచుకుపడుతోందని అంటున్నారు.ఆసుపత్రులలో చేరుతున్న వారి సంఖ్య పెరుగుతోందని అయితే చికిత్సలో కొత్త విధానాల ద్వారా మరణాల రేటు తగ్గుతోందని తెలిపారు.అయితే
ఈ మహమ్మారిని తక్కువగా అంచనా వేయలేమని, కాలం గడుస్తున్న కొద్దీ దీని ప్రభావం మారవచ్చని హెచ్చరిస్తున్నారు.కేవలం ఒక్క వారం రోజుల్లోనే దాదాపు 4.44 లక్షల కేసులు నమోదయ్యాయని కోవిడ్ ట్రాక్ ప్రాజెక్ట్ తెలిపింది.ముఖ్యంగా నార్త్ డకోటా ,మోంటానా, విస్కాన్సిస్ , రాష్ట్రాలలో కరోనా ప్రభావం తీవ్రంగా ఉందని తెలిపింది.
ఇదిలా ఉంటే ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో ఒక్క సారిగా కరోనా కేసులు పెరిగిపోవడంతో ఈ ప్రభావం ఎన్నికలపై ఎక్కడ పడుతుందోనని ట్రంప్ బృందం ఆందోళన వ్యక్తం చేస్తోంది.