లాక్ డౌన్ ఎఫెక్ట్ తో థియేటర్లు పూర్తిగా మూతపడ్డాయి.దీంతో డిజిటల్ ఎంటర్టైన్మెంట్ కి జనం అలవాటు పడ్డారు.
ఇంట్లో ఉండి చేతిలో సెల్ ఫోన్ లో హ్యాపీగా సినిమాలు చూసుకునే అవకాశం ఉండటంతో వాటిపై ఆసక్తి చూపించారు.దీంతో సినిమాలు కూడా మెల్లగా డిజిటల్ ఎంటర్టైన్ మెంట్ లోకి అడుగుపెట్టాల్సి వచ్చింది.
ఓటీటీ సంస్థలు ప్రేక్షకుల అభిరుచి మేరకు కొత్త సినిమాలు కొనేసి తమ ఛానల్స్ లో రిలీజ్ చేయడం ద్వారా మార్కెట్ ని మరింత విస్తరించుకున్నారు.అయితే ఈ డిజిటల్ ఎంటర్టైన్మెంట్ కారణంగా ప్రేక్షకుల అభిరుచి కూడా పూర్తిగా మారిపోయింది.
థియేటర్ కి వెళ్లి రెండు గంటల వినోదం లేదంటే కమర్షియల్ డ్రామా ఉంటే చాలు సినిమాని హిట్ చేసే ప్రేక్షకులు డిజిటల్ లో మాత్రం అలాంటి కథలకి ప్రాధాన్యత ఇవ్వడం లేదు.కంటెంట్ బేస్ కథలపై ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు.
హాలీవుడ్ సినిమాల తరహాలో బలమైన కథ, కథనాలు ఉండే సినిమాలకి బ్రహ్మరధం పడుతున్నారు.
అలాంటి బలమైన కథ ఉన్నది చిన్న సినిమానా, పెద్ద సినిమానా అని ఆలోచించడం లేదు.
కంటెంట్ కనెక్ట్ అయ్యిందా లేదా అనేది మాత్రమే చూస్తున్నారు.అలాంటి కథలతో వచ్చిన కలర్ ఫోటో, మిడిల్ క్లాస్ మెలోడీస్, అలాగే ఇతర బాషలలో వచ్చిన మరికొన్ని సినిమాలు ప్రేక్షకులని కట్టిపడేశాయి.
అక్షయ్ కుమార్ లక్ష్మి, అనుష్క నిశ్శబ్దం, నాని వి లాంటి సినిమాలు రివర్స్ కొట్టేశాయి.డిజిటల్ ప్రేక్షకులు భారీ బడ్జెట్ తో నిర్మించిన ఇలాంటి సినిమాలు చూడటానికంటే చిన్న సినిమాలు చూడటానికే ఎక్కువ ఆసక్తి చూపించారు.
దీంతో ఒకప్పుడు ఏదైనా ఒక జోనర్ వస్తే చిన్న నిర్మాతలు అందరూ అదే జోనర్ పట్టుకొని సినిమాలు తీసేవారు.ఈ కారణంగా చిన్న సినిమాలు వంద వస్తే అందులో ఒకటి, రెండు మాత్రమే థియేటర్ లో ప్రేక్షకులని మెప్పించేవి.
అయితే ఇప్పుడు డిజిటల్ మీడియా, ఓటీటీ సంస్థల కారణంగా, ప్రేక్షకుల అభిరుచిని అర్ధం చేసుకొని ఒకే జోనర్ అని కాకుండా కంటెంట్ బేస్ కథలతో తక్కువ బడ్జెట్ తో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు.డిజిటల్ ఎంటర్టైన్మెంట్ కారణంగా తెలుగు సినిమా స్టాండర్డ్స్ ఇప్పుడు పూర్తిగా మారాయని టాక్ గట్టిగా వినిపిస్తుంది.