కాకినాడ: తమ సామాజిక వర్గాన్ని దోపిడీ, దొంగల సామాజిక వర్గంగా ముద్ర వేసేందుకు గత మూడేళ్ల కాలం నుంచి కుట్ర జరుగుతోందని, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతి ఒకే రాజధానిగా ఉండాలని, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పునకు తాము వ్యతిరేకమంటూ కమ్మ సామాజిక వర్గ నాయకులు స్పష్టం చేశారు.ఆదివారం కాకినాడ సిద్ధార్థ నగర్లో ఉన్న కంటిపీడు సుబ్బమ్మ కమ్మవారి కళ్యాణ మండప భవనంలో ఉభయ తూర్పుగోదావరి జిల్లా కమ్మ మహాజన సంఘ సర్వసభ్య సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా నిర్వహించిన పాత్రికేయులు సమావేశంలో పలువురు కమ్మ సామాజిక వర్గ నేతలు మాట్లాడారు.ఈ సందర్భంగా ఉభయ గోదావరి జిల్లా అధ్యక్షుడు చుండ్రు గోపాలకృష్ణ మాట్లాడుతూ ఒకే అభిప్రాయం, ఒకే ఆశయం కోసం ఈ సమావేశం నిర్వహించామన్నారు.
ముఖ్యఅతిథి ఏపీ కాకతీయ సమాఖ్య ప్రధాన కార్యదర్శి బెజవాడ వెంకటరావు మాట్లాడుతూ రెండు నెలల్లో ప్రపంచ కమ్మ సామాజిక వర్గ సమావేశంను నిర్వహిస్తున్నామని సన్నాహ సమావేశంగా ప్రతి జిల్లాలో నిర్వహిస్తూ ఇప్పుడు కాకినాడలో నిర్వహించామన్నారు.ఈ సమావేశానికి సుమారు ఆరు రాష్ట్రాల నుంచి కాకినాడ నగరానికి కమ్మ సామాజిక వర్గ ప్రతినిధులు హాజరయ్యారన్నారు.
తమ సామాజిక వర్గంలో చాలా మంది భూమిని నమ్ముకుని వ్యవసాయం చేశారని తద్వారా ఉన్నత స్థితిలోకి వెళ్లి జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతలు గడించారన్నారు.తాము అన్ని కుల, మతాలతోనూ జీవనం సాగిస్తూ స్నేహ పూర్వక సంబంధాలు కలిగి ఉంటామన్నారు.
ఈ మధ్యకాలంలో తమపై దాడులు పెరిగాయని, తమను దోపిడి సామాజివర్గంగా చిత్రీకరణకు ప్రయత్నం జరుగుతుందన్నారు.ఇకనుంచి తమ సామాజిక వర్గమును విమర్శిస్తే ఉపేక్షించేది లేదన్నారు.
రాజకీయంగా వారి వారి ఇష్టమని చెప్పారు.అలాగే తాము ప్రతి ఏటా తమ సామాజిక వర్గానికి 75% ఇతరులకు 25% స్కాలర్షిప్లు అందిస్తున్నామని వారు పేర్కొన్నారు.
ఈ సమావేశంలో నాయకులు పర్వతనేని పట్టాభిరామ్, మందలపు జి ధన శేఖర్, బొడ్డు రవిశంకర్, తాళ్లూరి జీవన్ కుమార్, కొసరాజు గోపాలకృష్ణ, నెక్కంటి శ్రీనివాస్, అనంతరామన్ తదితరులు పాల్గొన్నారు.