తెలంగాణాలో రాజకీయాలు పోలింగ్ తేదీ సమయం దగ్గరకు వచ్చే కొద్ది రసవత్తరంగా తయారయ్యాయి.ఎన్నికల సమయంలో నాయకులంతా ఒకరిని ఒకరు తిట్టుకోవడం … ఆరోపణలు చేసుకోవడం సర్వ సాధారణమే.అయితే… ఈ ఆరోపణలు ఏకంగా చంపుకునే వరకు వెళ్లడమే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారిన కాంగ్రెస్ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి వ్యవహారమే తీసుకుంటే… ఆయన కేసీఆర్ పార్టీ నాయకులు నన్ను చంపాలని చూస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు కలకలం రేపుతోంది.
తనను ఓడించేందుకు కేసీఆర్ అండ్ గ్యాంగ్ భారీ పథకం రచించిందని.డబ్బు పంపిణి చేసి ఓటర్లను ప్రలోభ పెట్టాలని చూస్తుందని అన్నారు.తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఎన్నిరకాలుగా చెరబట్టాలో అన్ని రకాలుగా చెరబట్టారన్నారు.నియమ నిబంధనలకు విరుద్ధంగా కేసీఆర్ వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.ఇదిలా ఉంటే.మొన్న కొడంగల్ టీఆర్ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డి ఇంటిలో ఐటీ సోదాలు నిర్వహించగా 17.51 కోట్లు దొరికాయన్నారు.కానీ మోడీ ఒత్తిడి కారణంగా ఆ వివరాలు బయటకు రాకుండా ఎన్నికల అధికారులు గోప్యత పాటిస్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు.కానీ కొన్ని పత్రికలు, ఛానల్స్ మాత్రం రూ.51 లక్ష దొరికినట్లు లీకులు ఇచ్చారని రేవంత్ తెలిపారు.
ఇన్ కం ట్యాక్స్ దాడులలో ఒక డైరీ దొరికిందని ఆ డైరీలో ఏయే నేతలను కొనుగోలు చెయ్యాలని ఎంతెంత ఇవ్వాలి అన్నది ఆ డైరీలో పూర్తి వివరాలు ఉన్నట్లు రేవంత్ తెలిపారు.అంతే కాదు తనకు భద్రత కల్పించాలని కోర్టు ఆదేశించినా తనకు కల్పించడం లేదన్నారు.తన హత్యకు కుట్ర పన్నుతున్నారని.గతంలో గద్దర్ మాదిరిగానే తనపై కూడా దాడి జరగొచ్చన్నారు.ఇందుకు సంబంధించి తన వద్ద పూర్తి సమాచారం ఉందన్నారు.అంతే కాదు తమిళనాడు ఆర్కే నగర్ తరహాలో కొడంగల్ ఎన్నిక వాయిదా వేయించడం కోసం తనను హత్య చేయాలనుకుంటున్నారని చెప్పారు.
తనకు కేంద్ర భద్రతా దళాలతో భద్రత కల్పించాలని కోర్టు ఆదేశించినా ఇప్పటికీ ఆ దిశగా చర్యలు తీసుకోకపోవడం అనుమానాలను పెంచుతోందన్నారు.