అసలు కాంగ్రెస్ పార్టీ అంటేనే అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువగా ఉంటుంది.అందరూ అధిష్టానం వద్ద పలుకుబడి ఉన్న నేతలు కావడంతో, గట్టిగానే స్వరం పెంచి మాట్లాడుతూ ఉంటారు.
ఒకరి నాయకత్వంలో మరొకరు పనిచేసేందుకు ఏమాత్రం ఇష్టపడరు.ఇదే విధంగా మొదటి నుంచి కాంగ్రెస్ నేతల వైఖరి ఉంటూ వస్తోంది.
ఇక పిసిసి అధ్యక్ష పదవి విషయంలోనూ కాంగ్రెస్ లో జరిగిన రాద్దాంతం గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరంలేదు.పార్టీ ఉనికి కోల్పోయే దశలో ఉన్నా, పార్టీని ఏ విధంగా అధికారం వైపు తీసుకురావాలి ? ఏ విధంగా బలోపేతం చేయాలి అనే విషయంపై దృష్టి పెట్టకుండా, కేవలం తమకు పదవి దక్కితే చాలు అన్నట్లుగా ప్రయత్నాలు చేశారు.
చివరకు రేవంత్ రెడ్డి కి పిసిసి అధ్యక్ష పదవి కట్టబెట్టడం తో వరసగా అసంతృప్త నేతలు బయటకు వస్తున్నారు.ముఖ్యంగా ఈ పదవి పై ఆశలు పెట్టుకున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి పార్టీ అధిష్టానంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.
వెంకట్ రెడ్డి ఎంత ఘాటుగా కాంగ్రెస్ అధిష్టానంపై విమర్శలు చేస్తారని ఎవరూ ఊహించలేదు.అయినా ఈ స్థాయిలో విమర్శలు చేయడంతో ఇప్పుడు ఆయనపై అధిష్టానం సస్పెన్షన్ వేటు వేస్తుందా లేదా అనే అనుమానం అందరిలోనూ నెలకొంది.
కాంగ్రెస్ లో చాలాకాలం నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అసంతృప్తిగానే ఉంటున్నారు.ఆయన సోదరుడు రాజగోపాల్ బీజేపీలో చేరడం తో, అదేబాటలో వెళ్తారని ప్రచారం జరిగినా, పిసిసి పీఠం పై ఆశలు పెట్టుకున్న ఆయన సైలెంట్ గా ఉండి పోయారు.
అయితే ఇప్పుడు రేవంత్ కు పిసిసి అధ్యక్ష పదవి కట్టబెట్టడం తో తనలో ఉన్న అసంతృప్తి మొత్తాన్ని వెంకటరెడ్డి బయట పెడుతున్నారు.అయితే రేవంత్ పదవి ఇవ్వడం వల్ల ఈ స్థాయిలో విమర్శలు వస్తాయని అధిష్టానం ముందే గ్రహించినా, వెంకటరెడ్డి తమపై విమర్శలు చేయడం మాత్రం ఆషామాషీగా తీసుకోవడం లేదు.ఆయనపై సస్పెన్షన్ వేటు వేస్తే మిగిలిన నేతలు వైలెంట్ అవుతారని, లేకపోతే ఇదే విధంగా అసంతృప్తిగా వినిపిస్తారని అభిప్రాయపడుతోంది.త్వరలోనే ఆయనపై వేటు వేసేందుకు సిద్ధమవుతున్నట్లుగా కనిపిస్తున్నా, పార్టీ పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న ఈ పరిస్థితుల్లో ఉన్న నాయకులను వదులుకుంటే ఇబ్బందులు ఎదురవుతాయి అనే టెన్షన్ కూడా అధిష్టానం కు ఉంది.
అందుకే ఈ విషయంలో ఎలా ముందుకు వెళ్లాలి అనే దానిపై ఆలోచనలో పడ్డట్టు సమాచారం.