దేశంలో గత కొన్ని రోజులుగా అడ్డూఅదుపు లేకుండా పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్న సంగతి తెలిసిందే.దేశంలోని మూడు, నాలుగు రాష్ట్రాల్లో లీటర్ పెట్రోల్ ధర 100 రూపాయలకు చేరగా భవిష్యత్తులో పెట్రోల్, డీజిల్ ధరలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి.
కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలపై దృష్టి పెట్టి పన్నులు తగ్గించి ప్రజలకు ప్రయోజనం చేకూర్చాలని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఇప్పటికే పలువురు బాలీవుడ్ ప్రముఖులు పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలపై స్పందించి విమర్శలు చేశారు.
అయితే నెటిజన్లు మాత్రం బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, అక్షయ్ కుమార్ లు ఈ వివాదం గురించి స్పందించాలని కోరుతున్నారు.నెటిజన్లు ఈ విధంగా అమితాబ్, అక్షయ కుమార్ లను స్పందించాలని కోరడానికి ముఖ్యమైన కారణమే ఉంది.
కేంద్రంలో మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న సమయంలో కూడా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి.
ఆ సమయంలో పెట్రోల్, డీజిల్ రేట్ల పెరుగుదలకు వ్యతిరేకంగా అమితాబ్, అక్షయ్ కుమార్ తమకు కార్లు కొనగలిగే స్థోమత ఉందని.పెట్రోల్ ను మాత్రం కొనలేమని కామెంట్లు చేశారు.అయితే ఇప్పుడు మాత్రం లీటర్ పెట్రోల్ 100 రూపాయలకు చేరినా అమితాబ్, అక్షయ్ సైలెంట్ గా ఉండటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఎంపీసీసీ అధ్యక్షుడు నానా పటోలే అమితాబ్, అక్షయ్ సినిమాల షూటింగ్ లను అడ్డుకోవడంతో పాటు సినిమా ప్రదర్శనలను కూడా అడ్డుకుంటామని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
అమితాబ్ బచ్చన్, అక్షయ్ కుమార్ ఊహించని విధంగా వివాదంలో చిక్కుకోవడం గమనార్హం.
స్టార్ సెలబ్రిటీలు వివాదం గురించి స్పందించకపోవడంలో సెలబ్రిటీలు సైతం కేంద్రానికి భయపడుతున్నారని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.ఈ వివాదం గురించి అమితాబ్, అక్షయ్ స్పందిస్తారేమో చూడాల్సి ఉంది.