తెలంగాణ ఎన్నికలు అన్ని పార్టీల అభ్యర్థులకు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి.గెలుపు ఎవరి వశం అవుతుందో తెలియక ప్రధాన పార్టీల అభ్యర్థులు తీవ్రంగా శ్రమిస్తున్నారు.
టీఆర్ఎస్ ను మళ్ళీ అధికారంలోకి రానివ్వకూడదు అని మహాకూటమిలోని పార్టీలు ప్రయత్నిస్తుండగా… ఆ కూటమిని చిత్తు చేసి మళ్ళీ అధికారం చేపట్టాలని టీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది.ప్రస్తుతానికి తెలంగాణాలో నామినేషన్స్ పక్రియ ముగియడంతో… ప్రధాన పార్టీలన్నీ ప్రచారం మీదే దృష్టిపెట్టాయి.
ఇక కొన్ని కొన్ని నియోజకవర్గాలు చాలా ప్రతిష్టాత్మకంగా పార్టీలు తీసుకున్నాయి.ఇటువంటి నియోజకవర్గాల్లో ఖమ్మం పార్లమెంట్ పరిధిలోని మధిర నియోజకవర్గం ఒకటి.ఈ అసెంబ్లీ నియోజకవర్గంలో వైరా మండలానికి చెందిన ఇద్దరు నాయకులు ప్రధాన ప్రత్యర్థులుగా తలపడుతున్నారు.
వైరా మండలంలోని స్నానాల లక్ష్మీపురానికి చెందిన మల్లు భట్టి విక్రమార్క కాంగ్రెస్ నుంచి, ఇదే మండలం కొష్టాలకు చెందిన లింగాల కమలరాజు టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.ఈ ఇద్దరు ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు.1994లో వైరా, తల్లాడ మండలాలు మధిర నియోజకవర్గంలో కలిసి జనరల్ స్థానంగా ఉన్నప్పుడే భట్టి విక్రమార్క పోటీ చేసేందుకు ఆసక్తి ప్రదర్శించారు.2009లో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన జరిగి మధిర ఎస్సీ రిజర్వుడ్ అయిన తర్వాత మాత్రమే ఆయనకు పోటీచేసే అవకాశం లభించింది.ఇక టీఆర్ఎస్ అభ్యర్థి విషయానికి వస్తే… కమలరాజు 1995లో వైరా ఎంపీపీగా పని చేశారు.
పూర్వపు మధిర నియోజకవర్గంలో సీపీ ఎం కార్యకలాపాల్లో భాగంగా డివిజన్ కేంద్రంగా ఉన్న మధిరకు వచ్చారు.గత, ప్రస్తుత ఎన్నికల్లో భట్టి విక్రమార్క కాంగ్రెస్ అభ్యర్థిగానే పోటీ చేసి విజయం సాధించి మూడోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
కమలరాజు పోటీ మాత్రం రెండుసార్లు సీపీఎం నుంచి, ప్రస్తుతం టీఆర్ఎస్ నుంచి చేస్తున్నారు.2009లో మహాకూటమి నుంచి టీడీపీ, సీపీఐ, టీఆర్ఎస్ మద్దతుతో సీపీఎం అభ్యర్థిగా పోటీచేశారు.భట్టి చేతిలో స్వల్ప తేడాతో ఓడిపోయారు.2014 ఎన్నికల్లో వైసీపీ మద్దతుతో సీపీఎం అభ్యర్థిగా పోటీచేశారు.భట్టిపై తలపడి ఓటమి పాలయ్యారు.ఇప్పుడు మళ్లీ భట్టి విక్రమార్కకు ప్రధాన ప్రత్యర్థిగా, టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా కమలరాజు మూడోసారి బరిలోకి దిగుతున్నారు.కమలరాజు రెండు ఎన్నికల్లో సీపీఎం నుంచి పోటీ చేశారు.ప్రస్తుత ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు.
మధిర నియోజకవర్గ టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి లింగాల కమల్రాజ్ గెలుపే లక్ష్యంగా నాయకులు,కార్యకర్తలు పనిచేస్తున్నారు.మండల పరిధిలోని ప్రతీ గ్రామానికి వెళ్లి లింగాల కమల్రాజ్ కేసీఆర్ ప్రవేశపెట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరిస్తున్నారు.పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.ఎక్కడకు వెళ్లినా ప్రజలు టీఆర్ఎస్కు ఆదరణ బాగా కనిపిస్తోంది.కాంగ్రెస్ ఎమ్మెల్యే బట్టి విక్రమార్క 2014లో గెలిచినా నియోజకవర్గానికి చేసింది ఏమీ లేదని నియోజకవర్గ ప్రజలు పెదవి విరుస్తున్నారు.ఆయన వ్యవహారశైలి కారణంగా ఇక్కడ తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది.
ప్రజలకే కాదు స్థానిక క్యేడెర్ కు కూడా ఆయన అందుబాటులో ఉండకపోవడం … ఈ నిజాయకవర్గ అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉండడం ఈయన గెలుపు అవకాశాలను దెబ్బతీసేలా కనిపిస్తున్నాయి.
ఇక మధిర నియోజకవర్గం ఖమ్మం పార్లమెంట్ పరిధిలో ఉండడంతో టీఆర్ఎస్ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా ఈ నియోజకవర్గాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.ఎలా అయినా సరే భట్టిని ఓడించడమే ధ్యేయంగా ఎంపీ పొంగులేటి పావులు కదుపుతున్నారు.నియోజకవర్గంలో టీఆర్ఎస్ పట్టు పెంచుతూ… కూటమి అభ్యర్థి భట్టి విక్రమాదిత్య గెలుపు అవకాశాలను దెబ్బతీయాలనే పావులు కదుపుతున్నాడు.
ఈ నియోజకవర్గంలో పల్లె నిద్రలు చేస్తూ… టీఆర్ఎస్ విజయావకాశం కోసం కృషి చేస్తున్నాడు.అంతే కాదు ఇదే నియోజకవర్గంలో మకాం వేస్తూ … పల్లె నిద్రలు చేస్తూ … మొత్తం ఫోకస్ అంతా ఈ నియోజకవర్గం మీదే పెట్టాడు.
పొంగులేటి ఈ నియోకవర్గం పై పట్టుదలగా ఉండడం… భట్టి విక్రమాదిత్యపై నియోజకవర్గంలో వ్యతిరేకత ఉండడంతో లింగాల కమలరాజు కు గెలుపు ధీమా పెరిగింది.ఈ పరిణామాలన్నీ కూటమి అభ్యర్థి భట్టికి కలవరం పుట్టిస్తున్నాయి.