రోజురోజుకు తెలంగాణలో తమ పార్టీ గ్రాఫ్ తగ్గిపోతుండటంతో, కాంగ్రెస్ ఎన్నో రకాల ఇబ్బందులను ఎదుర్కొంటోంది.టిఆర్ఎస్ తరువాత తామే అన్న ధీమా ఆ పార్టీలో సడలిపోతోంది.
ఇప్పుడు బిజెపి క్రమ క్రమంగా బలం పెంచుకుంటూ ఉండడం, టిఆర్ఎస్ బిజెపిల మధ్య పోటీ అన్నట్లుగా పరిస్థితి మారడం వంటి వ్యవహారాలు, ఆ పార్టీకి ఇబ్బందికరంగా మారాయి.ఈ పరిస్థితి నుంచి బయట పడేందుకు అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తూనే వస్తోంది.
ఇదిలా ఉంటే, పార్టీ నుంచి ఒక్కో నేత బయటకు వెళ్ళి పోతూ ఉండటం, కాంగ్రెస్ అధిష్టానం పెద్దలను కలవడం, దడ పుట్టిస్తోంది.రానున్న రోజుల్లో రాజకీయ భవిష్యత్తు ఎటువంటి డోకా ఉండదని, బిజెపి గ్రాఫ్ తగ్గుతోందని పదేపదే నేతలకు నూరిపోస్తున్నా, వారిలో ధైర్యం ఏ మాత్రం సరిపోవడం లేదు. ఇదిలా ఉంటే తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో స్టార్ క్యాంపెయినర్ గా ఉన్న విజయశాంతి ప్రచార కమిటీ చైర్మన్ గానూ ఉన్నారు.కాంగ్రెస్ అధిష్టానం సైతం తగిన ప్రాధాన్యం ఇస్తూ వస్తోంది.
అయితే పార్టీలోని కొంతమంది సీనియర్ నాయకుల వ్యవహార శైలి కారణంగా ఆమె అసంతృప్తికి గురవడం, కాంగ్రెస్ లో ఉంటే తన రాజకీయ భవిష్యత్తుకు పులిస్టాప్ పడినట్లేనని అభిప్రాయపడుతున్నారు.దీంతో ఆమె బీజేపీ లోకి వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తుండటం, కొద్ది రోజుల క్రితం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ని కలవడం, ఆ తర్వాత తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ తోనూ భేటీ అవ్వడం వంటి వ్యవహారాలు ఎన్నో నడిచినట్టుగా ప్రచారం జరిగింది.
తాజాగా తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ విజయశాంతిని ఉద్దేశించి ప్రశంసలు కురిపిస్తూ, అదే పనిగా పొగడడం తో ఒక్కసారిగా కాంగ్రెస్ ఉలిక్కి పడింది.
ఆమె బిజెపిలో కి వెళ్తున్నారని, అందుకే బండి సంజయ్ ఈ విధంగా ఆమెను పొగిడారని భావించిన కాంగ్రెస్ వెంటనే విజయశాంతి ని బుజ్జగించేందుకు తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి మాణిక్యం ఠాగూర్ ను రంగంలోకి దింపింది.
ఈ మేరకు విజయశాంతి నివాసానికి వెళ్లిన ఆయన సుదీర్ఘంగా ఆమె తో చర్చించినట్లుగా తెలుస్తోంది.ఈ సందర్భంగా తెలంగాణలోని కాంగ్రెస్ సీనియర్లు తనకు తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదని, సభలు సమావేశాలకు తనను పిలవడం లేదని, పట్టించుకోనట్టు వ్యవహరిస్తున్నారు అని, అనేక ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.
విజయశాంతి చెప్పిన విషయాలన్నీ విన్న ఠాగూర్ ఇకపై ఆ విధంగా జరగదని, కాంగ్రెస్ లో మీకు తగిన ప్రాధాన్యం ఎప్పుడూ ఉంటుందని, ఏ ఇబ్బంది రాకుండా అధిష్టానం చూసుకుంటుందని భరోసా ఇచ్చినట్లు తెలుస్తోంది.అయితే ఠాగూర్ భరోసాతో రాములమ్మ కాంగ్రెస్ లోనే కొనసాగుతారా ? బిజెపి వైపు వెళ్తారా ? అనేది క్లారిటీ రావాల్సి ఉంది.రాములమ్మ కనుక బీజేపీ వైపు వెళ్ళిపోతే పార్టీలోని మిగిలిన నాయకుల్లో భయాందోళనలు నెలకొంటాయని, ఆ ప్రభావం తో మరికొంతమంది అగ్రనేతలు కాంగ్రెస్ ను వీడే అవకాశం ఉంటుందని, అదే జరిగితే ఇక తెలంగాణలో పార్టీ ఉనికి కోల్పోతుందనే భయం ఇప్పుడు కాంగ్రెస్ ను వెంటాడుతోంద.