హుజూరాబాద్ నియోజకవర్గం లో నామినేషన్ ల ప్రక్రియ పూర్తయిపోయింది.ఇక అన్ని పార్టీలు ఎన్నికల ప్రచారం పైనే దృష్టి సారించాయి.
బీజేపీ టిఆర్ఎస్ పార్టీలు ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతూ ఉండగా, కాంగ్రెస్ మాత్రం ఈ విషయంలో కాస్త వెనుకబడినట్టుగానే కనిపిస్తుంది. టిఆర్ఎస్ నుంచి గెల్లు శ్రీనివాస్ యాదవ్, బీజేపీ నుంచి ఈటెల రాజేందర్ పోటీ చేస్తుండగా , కాంగ్రెస్ నుంచి ఎన్.ఎస్.యూ.ఐ అధ్యక్షుడు బల్మూర్ వెంకట్ పోటీలో ఉన్నారు.అయితే బల్మూర్ వెంకట్ నామినేషన్ దాఖలు చేసిన సమయంలో, తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో పాటు, మధుయాష్కీ గౌడ్, జిల్లాకు చెందిన కొంతమంది కీలక నాయకులు హాజరై హడావుడి చేశారు.
అయితే ఆ తరువాత ఈ నియోజకవర్గం వైపు కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఎవరు చూడకపోవడం, అసలు ఈ నియోజకవర్గంలో ఎన్నికలను పట్టించుకోనట్టు గానే వ్యవహరిస్తూ ఉండడంతో, కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్ ఒంటరిగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు.
ఇక్కడ పోటీ మొత్తం బీజేపీ, టిఆర్ఎస్ ల మధ్య నెలకొంది అన్నట్లుగా పరిస్థితి ఏర్పడింది.
ముఖ్యంగా తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఈ నియోజకవర్గం లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తారు అని ముందుగా అందరూ భావించినా, ఆయన మాత్రం నిరుద్యోగ జంగ్ సైరన్ పేరుతో సభలు , సమావేశాలు నిర్వహిస్తూ హడావిడిగా ఉన్నారు.ఇక ప్రచార కమిటీ చైర్మన్ గా ఉన్నా, మధుయాష్కిగౌడ్ ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ గా ఉన్న దామోదర రాజనర్సింహ, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఇలా ఎవరూ ఈ నియోజకవర్గాన్ని పట్టించుకోనట్టుగానే వ్యవహరిస్తున్నారు.
వీరే కాకుండా జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ఇలా ఎవరికి వారే సైలెంట్ అయిపోవడం తో కాంగ్రెస్ పోలింగ్ కు ముందే చేతులు ఎత్తేసినట్టు గా పరిస్థితి ఏర్పడింది.
ముందు నుంచి ఈ నియోజకవర్గంపై కాంగ్రెస్ పూర్తిస్థాయిలో దృష్టి పెట్టినట్లు గా కనిపించినా, ఆ తర్వాత సైలెంట్ అయిపోవడం తో, కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్ ఒంటరిగానే ఇక్కడ ప్రచారం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.ఎన్నికల ఫలితాలపై ముందుగానే కాంగ్రెస్ ఒక అంచనాకు వచ్చేసిన పరిస్థితి ఏర్పడినట్లు గా కనిపిస్తోంది.
.