అందరిలా ఉంటే తమ స్పెషాలిటీ ఏముంటుంది ? తమది అంతా సంథింగ్ స్పెషల్ అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు తెలంగాణ కాంగ్రెస్ నాయకులు.ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ రాజకీయంగా ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటోంది.
వరుస ఎదురు దెబ్బలతో రాజకీయంగా కోలుకోలేని విధంగా దెబ్బతింది.ప్రత్యేక తెలంగాణ ఇచ్చిన పార్టీగా ఒక వెలుగు వెలగాల్సిన కాంగ్రెస్, వరుసగా ఎన్నికల్లో ఓటమి ఎదురవడంతో ఇప్పుడు ఉనికి కోసం పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఇప్పటికే టిఆర్ఎస్, బీజేపీలు అధికారం కోసం పోటీ పడుతున్న సమయంలో, తెలంగాణ కాంగ్రెస్ లో మాత్రం నాయకులు గ్రూపు రాజకీయాలకు పాల్పడుతూ ఇప్పటికీ పార్టీ పదవుల కోసం ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం, ఒకరికి వ్యతిరేకంగా మరొకరు అధిష్టానానికి రిపోర్టులు పంపడం ఇలా ఏదో ఒక హడావుడి చేస్తూనే వస్తున్నారు.
ప్రస్తుతం తెలంగాణ పిసిసి అధ్యక్ష పదవి ని భర్తీ చేసే కార్యక్రమానికి అధిష్టానం శ్రీకారం చుట్టింది.ఈ మేరకు పార్టీ నాయకుల అభిప్రాయాలను సేకరించి ఫైనల్ డెసిషన్ ప్రకటించేందుకు సిద్ధమవుతున్న తరుణంలో, ఆ పదవిని ఆశిస్తున్న వారు తమకు పిసిసి అధ్యక్ష పదవి ఇవ్వాలని, తమకు పదవి ఇస్తే కాంగ్రెస్ పార్టీని ఏవిధంగా ముందుకు తీసుకు వెళ్తామో చెబుతూనే పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చేందుకు పాదయాత్ర చేపడతామని అధిష్టానానికి ఆఫర్ లు ఇచ్చేస్తున్నారు.అధిష్టానం పిసిసి అధ్యక్ష పదవి ఎవరికి ఇవ్వాలి అనే విషయం ఇంకా తేల్చుకోలేదు.
మరి కొద్ది రోజులకు కానీ, ఈ విషయంలో ఓ క్లారిటీ వచ్చే అవకాశం కనిపించకపోవడంతో ఎవరికివారు అధిష్టానం దృష్టిలో పడేందుకు గట్టిగానే ప్రయత్నిస్తున్నారు ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి తనకు పిసిసి అధ్యక్ష పదవి కేటాయించాలని, కేసీఆర్, కేటీఆర్, టీఆర్ఎస్ పై తానే రాజీ లేకుండా పోరాటం చేస్తున్నా అని, ఆ పదవిని తనకు కేటాయిస్తే రాష్ట్రమంతా పాదయాత్ర చేపడతానని, ప్రతి గుమ్మానికి వెళ్లి కాంగ్రెస్ బలోపేతం అయ్యే విధంగా తన వంతు ప్రయత్నాలు చేస్తానని అధిష్టానానికి తెలియజేశారు.
అలాగే మరో కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకట్రెడ్డి సైతం తనకే ఆ పదవిని కేటాయించాలని, ఆ అర్హతలు తనకే ఉన్నాయని, మొదటి నుంచి తాను కాంగ్రెస్ లోనే ఉన్నాను అని, తనకు పిసిసి అధ్యక్ష పదవి ఇస్తే రాష్ట్రమంతా పర్యటించి పార్టీని బలోపేతం చేస్తానని , అధికారంలోకి తప్పకుండా తీసుకు వస్తాను అంటూ ప్రకటించారు.
ఇక సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి సైతం తాను పాదయాత్ర చేపడతామని, తనకి పిసిసి అధ్యక్ష పదవి కేటాయించాలని అధిష్టానానికి తెలియజేశారు.పిసిసి అధ్యక్ష పదవి దక్కించుకునేందుకు నాయకులు ఈ స్థాయిలో హడావుడి చేస్తూ పాదయాత్ర పేరు చెప్పి అధిష్టానాన్ని బుట్టలో వేసుకునేందుకు గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు.
ఈ పాదయాత్రల ఫార్ములా ఎవరికి వర్కౌట్ అవుతుంది అనేది తేలాలంటే మరికొంత కాలం వెయిటింగ్ చేయాల్సిందే.కాకపోతే పదవి దక్కించుకునేందుకు పాదయాత్రల పేరుతో నాయకులు హడావుడి చేస్తుండడం పైనే ఇప్పుడు చర్చ జరుగుతోంది.