ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు చిత్రవిచిత్రంగా వ్యవహరిస్తూ ఉంటారు.ముఖ్యంగా ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి వలసలు అనేది సర్వసాధారణంగా మారిపోతాయి.
పార్టీలో బలమైన నాయకులను చేర్చుకోవడం ద్వారా, తాము బలోపేతం అవ్వాలని మరో పార్టీ భావిస్తూ ఉంటుంది.ఈ క్రమంలోనే తెలంగాణలో గ్రేటర్ వార్ హోరాహోరీగా జరుగుతున్న సమయంలో, తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ విజయశాంతి బీజేపీకి అనుకూలంగా అనేక సంచలన వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశం గా మారింది.
కాంగ్రెస్ ను వీడి బీజేపీ లోకి వెళ్తారు అంటూ పెద్దఎత్తున ప్రచారం జరుగుతున్నా ఆమె ఖండించడం లేదు.తాజాగా బిజెపికి మద్దతుగా ఆమె మాట్లాడిన మాటలు రాజకీయంగా మారాయి.
బీజేపీ టీఆర్ఎస్ ఎంఐఎం మధ్య వివాదం నడుస్తోంది.పాతబస్తీలో రోహింగ్యాలు , పాకిస్తాన్ వాళ్లు ఉన్నారు అని, త్వరలోనే పాతబస్తీలో సర్జికల్ స్ట్రైక్ నిర్వహిస్తామంటూ బిజెపి తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేయడం పెద్ద వివాదానికి దారి తీసింది.
దీనిపై తీవ్రస్థాయిలో ఆయనపై విరుచుకు పడుతున్న సమయంలో బిజెపికి మద్దతుగా విజయశాంతి రంగంలోకి దిగడం ప్రాధాన్యం సంతరించుకుంది.బిజెపి , బండి సంజయ్ ను టార్గెట్ చేసుకుని విమర్శలు చేస్తున్న కేటీఆర్, ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ల పై ఆమె విమర్శలు గుప్పించారు.
గతంలో ఓవైసీ ఎన్నోసార్లు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారు.పది నిమిషాలు టైం ఇస్తే మా సత్తా ఏమిటో చూపిస్తామని అన్నారు.హిందూ దేవుళ్లను కించ పరిచేలా వ్యాఖ్యానించారు.మేం ఉమ్మేస్తే చార్మినార్ ఆనుకుని ఉన్న భాగ్యలక్ష్మి టెంపుల్ మునిగిపోతుందని అన్నారు.
నేరుగా ఓ డీజీపీ ని పట్టుకుని యూనిఫామ్ వదిలి రా చూసుకుందాం అని సవాల్ విసిరారు.అప్పుడు టిఆర్ఎస్ నేతలు కనీసం ఓవైసీ మాటలను ఖండించలేదు.
పైగా ఎంఐఎం , టిఆర్ఎస్ మిత్రపక్షాలు గా చలామణి అయ్యాయి.ఇటీవల కూడా ఓవైసీ ప్రగతి భవన్ కు వెళ్లి సీఎం కేసీఆర్ తో సమావేశం అయ్యారు.
ఇప్పుడు ఎన్నికలు వచ్చాయని మళ్లీ ఇద్దరు డ్రామాలు మొదలు పెట్టారు.బండి సంజయ్ వ్యాఖ్యల్లో తప్పేముంది ? నిజంగా కెసిఆర్ కు ధైర్యం ఉంటే పాతబస్తీ మొత్తం సర్వే చేయించాలి.ఇక్కడ ఉన్న రోహింగ్యాలను, పాకిస్తాన్ వాళ్లను గుర్తించాలి.అంతే కానీ బండి సంజయ్ మీద ఎదురుదాడి చేయడం ఏమిటి.?
అంటూ విజయశాంతి సోషల్ మీడియా ద్వారా ప్రశ్నించడం ఇప్పుడు కలకలం రేగుతోంది.ఆమె కాంగ్రెస్ లో ఉంటూ బీజేపీకి మద్దతు ఎలా మాట్లాడుతున్నారు అంటూ కాంగ్రెస్ నాయకులు సైతం విస్తుపోతున్నారు.ఆమె మాత్రం బీజేపీలో చేరకుండానే ఈ విధంగా కాంగ్రెస్ లో ఉంటూనే ఆ పార్టీకి మద్దతు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది.గ్రేటర్ ఎన్నికల తంతు ముగిసిన తర్వాత ఆమె బిజెపిలో చేరే అవకాశం ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది.