రాజీనామా చేయబోతున్నట్టు టిఆర్ఎస్ అధినేత కేసిఆర్ చేసిన సంచలన ప్రకటన పై రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి.గతంలో ఎప్పుడూ లేని విధంగా, కేసీఆర్ ఈ విధమైన సంచలన వ్యాఖ్యలు చేయడం వెనుక ఉన్న రాజకీయం ఏంటో ఎవరికీ అంతుపట్టడం లేదు.
అయితే ఈ వ్యాఖ్యలపై తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ విజయశాంతి సంచలన విమర్శలు చేశారు.కేసీఆర్ రాజీనామా ప్రకటన కు దారి తీసిన పరిస్థితులపై స్పందించారు.
మొన్నటి వరకూ విజయశాంతి సైలెంట్ గానే ఉంటూ వచ్చారు.ఇటీవలే ఆమె బీజేపీలోకి వెళ్ళిపోతున్నారు అంటూ పెద్ద ఎత్తున ప్రచారం సైతం జరుగుతూ వస్తోంది.
ఈ మేరకు ఆమె కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి తో మంతనాలు చేసినట్లుగానూ ప్రచారం జరిగింది.ఈ నేపథ్యంలో ఆమె మళ్లీ కాంగ్రెస్ కు అనుకూలంగా, కేసీఆర్ కు వ్యతిరేకంగా గళం విప్పారు.
తాజాగా కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ వ్యవహారాలకు సంబంధించి విజయశాంతి విమర్శలు చేశారు.కాంగ్రెస్ బీజేపీలను దెబ్బతీసేందుకు కేసీఆర్ హరీష్ రావు ను రంగంలోకి దించారని, ఆ బరువు బాధ్యతలన్నీ హరీష్ మీద పెట్టారని, అందుకే ఆయన తన శక్తికి మించి కష్టపడుతున్నారు అంటూ విజయశాంతి సానుభూతి వ్యక్తం చేశారు.
కానీ ఎన్నికల తర్వాత హరీష్ కు ఆయన మామ కేసీఆర్ పెద్ద జలక్ ఇవ్వబోతున్నారని వ్యాఖ్యానించడం ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది.దుబ్బాక ఉప ఎన్నికల ఫలితాలు తరువాత , గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు నిర్వహించి, ఆ ఫలితాలు వచ్చిన తర్వాత వెంటనే కేటీఆర్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని విజయశాంతి చెప్పారు.
దానిలో భాగంగానే కేసీఆర్ రాజీనామా అంటూ ఇప్పుడు హడావుడి చేస్తున్నారని, ఈ విధమైన వ్యాఖ్యలు గతంలో ఎప్పుడూ కేసీఆర్ చేయలేదంటూ ఆమె వ్యాఖ్యానించారు.కేసీఆర్ రాజీనామా వ్యవహారాన్ని బీజేపీ మీదకు నెట్టి , సీఎం పదవికి కేసీఆర్ రాజీనామా చేస్తానని చెప్పడమే దీనికి నిదర్శనం అంటూ ఆమె వ్యాఖ్యానించారు.అయితే ఒక్కసారిగా రాములమ్మ ఈ విధంగా యాక్టివ్ అవ్వడం, కేసీఆర్ రాజీనామా వ్యవహారాన్ని బీజేపీపైకి నెట్టబోతున్నారు అంటూ మాట్లాడడం అనేక అనుమానాలకు దారితీస్తుంది.బీజేపీ తరుపున ఆమె ఈ వ్యాఖ్యలు చేశారా ?కాంగ్రెస్ తరపున చేశారా ? అనేది ఎవరికీ అంతుపట్టడం లేదు.