తెలంగాణ ఫైర్ బ్రాండ్ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ విజయశాంతి బీజేపిలో చేరబోతున్నారు అంటూ.చాలా కాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి.
ఎప్పటికప్పుడు అది వాయిదా పడుతూ వస్తోంది.విజయశాంతి పార్టీ మారుతారు అనే వార్తలను కాంగ్రెస్ తెలంగాణ నాయకులతో పాటు, కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి ఠాకూర్ సైతం ఖండించారు.
కానీ ఏ సందర్భంలోనూ విజయశాంతి ఈ విషయంపై క్లారిటీ ఇవ్వలేదు.అయితే తెలంగాణ బీజేపి అధ్యక్షుడు బండి సంజయ్ అనేక సందర్భాల్లో విజయశాంతి ని పొగడడం, బీజేపీకి అనుకూలంగా అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉండడం, కాంగ్రెస్ లో తనకు పెద్ద గా గౌరవం దక్కడం లేదని, పార్టీ సీనియర్ నేతలు పట్టించుకోవడం లేదని, కీలకమైన సమావేశాలకు పిలవడం లేదని అనేక సందర్భాల్లో ఆమె తన సన్నిహితుల దగ్గర బాధను వ్యక్తం చేసినట్లుగానూ ప్రచారం జరిగింది.
ఈ మధ్యనే ఆమె ఢిల్లీకి వెళ్లడం తో బీజేపి లో చేరబోతున్నారు అంటూ హడావుడి జరిగింది.అయితే గ్రేటర్ ఎన్నికల ముందు ఆమె పార్టీ మారితే బీజేపికి కలిసి వస్తుందనే ఉద్దేశంతో ఆమె చేరికకు బీజేపి పెద్దలు బ్రేక్ వేసినట్లుగా సమాచారం.
నేడు కేంద్ర హోంమంత్రి అమిత్ షా గ్రేటర్ ఎన్నికల ప్రచారానికి రాబోతున్న తరుణంలో ఆమె ఆయన సమక్షంలో బీజేపీ కండువా కప్పుకో బోతున్నట్లు తెలుస్తోంది.ఇటీవలే తెలంగాణ బీజేపి అధ్యక్షుడు బండి సంజయ్ విజయశాంతి పై సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఆమె చాలా గొప్ప నాయకురాలు అని, తెలంగాణ ఉద్యమకారుల కు అన్యాయం చేసినట్టే, ఆమెకు అన్యాయం చేశారని బండి సానుభూతి వ్యక్తం చేశారు.
నేడు అమిత్ షా పర్యటన లోనే ఆమె బీజేపిలో చేరబోతున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతూ ఉండటం, విజయశాంతికి గ్రేటర్ ఎన్నికల హడావుడి ముగిసిన తర్వాత కీలకమైన పదవి ఇచ్చేందుకు బీజేపీ అధిష్టానం పెద్దలు ఒప్పుకున్నట్లు తెలుస్తోంది.విజయశాంతి ని పార్టీలో చేర్చుకుని కెసిఆర్ పై పూర్తిగా ఫోకస్ పెంచి, ఆమె ద్వారానే విమర్శలు చేయించడం ద్వారా బీజేపీకి కలిసి వస్తుందనే లెక్కల్లో బీజేపీ పెద్దలు ఉన్నట్లు తెలుస్తోంది.