తెలంగాణలో దుబ్బాక నియోజక వర్గానికి త్వరలో ఉప ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అన్ని పార్టీలు ఇప్పటి నుంచే రాజకీయ ఎత్తులు పైఎత్తులు వేస్తూ, హడావుడి చేస్తున్నాయి.అన్ని పార్టీలకు ఇక్కడ గెలుపు ప్రతిష్టాత్మకం కావడంతో, ఎవరికి వారు వ్యూహాలు, ప్రతివ్యూహాలు పన్నుతున్నారు.
ఒకరిపై ఒకరు పైచేయి సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు.ఇది ఇలా ఉంటే కాంగ్రెస్ పార్టీ తరఫున దుబ్బాక నియోజకవర్గం నుంచి ఫైర్ బ్రాండ్ నాయకురాలిగా గుర్తింపు తెచ్చుకున్న విజయశాంతి పోటీకి దిగుతారనే ప్రచారం ఊపందుకుంది.
ఆమె ఎంట్రీతో ఇక్కడ పోటీ రసవత్తరంగా ఉంటుందని అందరూ అభిప్రాయపడ్డారు.అయితే అకస్మాత్తుగా తాను పోటీ చేయడం లేదని ఆమె బాంబు పేల్చారట.
కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశంలో ఈ విషయాన్ని పిసిసి చీఫ్ కుమార్ రెడ్డి పార్టీ నేతలకు చెప్పినట్లు తెలుస్తోంది. విజయశాంతి పోటీకి దూరంగా ఉండడంతో ఆస్థానంలో గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి పేరు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇది ఇలా ఉంటే విజయశాంతి తాను పోటీ చేయడం లేదని ప్రకటించడానికి చాలా కారణాలే ఉన్నట్టుగా తెలుస్తోంది.బీజేపీ నుంచి ఆమెకు మంచి ఆఫర్ రావడంతో ఆమె ఆలోచనలో పడ్డారట గతంలో బీజేపీ నుంచి టిఆర్ఎస్ లో ఆమె చేరారు.
ఆ తర్వాత పరిణామాల నేపథ్యంలో కేసీఆర్ తో విభేదాలు ఏర్పడడం, ఆమె కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడం వంటివి జరిగిపోయాయి.ఎన్ని పార్టీలు మారినా ఆమె బీజేపీ అగ్రనేతలతో సన్నిహిత సంబంధాలు నెరుపుతూ ఉండడంతో, మళ్లీ ఆమెను బీజేపీ లోకి తీసుకువచ్చి తెలంగాణలో బీజేపీ ని పరుగులు పెట్టించాలని, ఆమెతో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై విమర్శలు చేయించాలని ఇలా ఎన్నో ఎత్తుగడలు బీజేపీ వేస్తోందట.
ఆమె కనుక బీజేపీలోకి వచ్చేందుకు మొగ్గుచూపిస్తే, రానున్న రోజుల్లో ఆమెకు రాజ్యసభ సభ్యత్వం కూడా కట్టబెట్టేందుకు బీజేపీ అగ్రనేతలు ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది.దీంతో ఆలోచనలో పడ్డ ఆమె కాంగ్రెస్ దుబ్బాక అభ్యర్థిగా పోటీ చేసేందుకు నిరాకరించినట్టు ప్రచారం జరుగుతోంది.విజయశాంతి వంటి ఫైర్ బ్రాండ్ ను చేర్చుకోవడం ద్వారా, తెలంగాణలో మరింతగా బల పడవచ్చని అంచనా వేస్తున్న బీజేపీ ఈ మేరకు చేరికలపై పూర్తిస్థాయిలో దృష్టి సారించినట్లు కనిపిస్తోంది.అతి త్వరలోనే రాములమ్మ కాషాయ జెండా కప్పుకోవడం ఖయ మంటూ అప్పుడే ప్రచారం మొదలయిపోయింది.