ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో పిసిసి అధ్యక్ష పదవి విషయమై పెద్ద చర్చ రచ్చ జరుగుతోంది.ఈ పదవిని చేపట్టేందుకు కాంగ్రెస్ సీనియర్ నాయకులు అంతా ఉత్సాహం చూపిస్తున్నారు.
అధిష్టానం ఆశీస్సులు తమకు ఉన్నాయి అంటే తమకు ఉన్నాయి అన్నట్లుగా నాయకులంతా వ్యవహరిస్తుండడం, ఇప్పటికే పార్టీ నేతల అభిప్రాయాలను రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాకూర్ సేకరించడం వంటి వ్యవహారాలు జరిగిపోయాయి.ముఖ్యంగా ఈ పదవి రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఈ ఇద్దరిలో ఒకరికి దక్కబోతోంది అనే విషయం తెలంగాణ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారిన తరుణంలో, రేవంత్– కోమటిరెడ్డి వర్గాలు అప్పుడే పిసిసి పదవి కన్ఫామ్ అయిపోయినట్లుగా హడావుడి మొదలుపెట్టారు.
వాస్తవంగా రేవంత్ రెడ్డికి పిసిసి అధ్యక్ష పదవి ఇచ్చేందుకు అధిష్టానం సైతం మొగ్గు చూపిస్తున్నా, పార్టీలోని సీనియర్ నాయకులు అధిష్టానంపై ఒత్తిడి పెంచుతున్నారు. రేవంత్ కు కాకుండా సీనియర్ నాయకులు ఎవరికి ఇచ్చిన తమకు అంగీకారమే అన్నట్లు గా చెబుతున్నారు.మరికొద్ది రోజుల్లో ఎవరికి ఈ పదవి దక్కుతుంది అనే విషయం క్లారిటీ రాబోతోంది.సరిగ్గా ఈ సమయంలోనే తనకు పిసిసి అధ్యక్ష పదవి వస్తే తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్ర చేపట్టి రాష్ట్రంలోని ప్రతి గడప ను పలకరించి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు తన వంతు కృషి చేస్తాను అంటూ రేవంత్ రెడ్డి సోషల్ మీడియా ద్వారా ప్రకటించడంతో, ఒక్కసారిగా సీనియర్లు కంగారు పడుతున్నారు.
ఇంకా అధ్యక్ష పదవి ఎవరికి కన్ఫామ్ అయ్యింది అనేది తేలకుండానే రేవంత్ పాదయాత్ర ప్రకటన చేయడం చూస్తుంటే, ఆయనకు పదవి రాబోతుందనే విషయం ముందుగానే లీక్ అయ్యిందా అనేది సీనియర్ నాయకులతో పాటు, రాజకీయ వర్గాలను హాట్ టాపిక్ గా మారింది.
అదీ కాకుండా కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి మాణిక్యం ఠాకూర్ చేపట్టిన అభిప్రాయ సేకరణలో నూ మెజార్టీ నాయకులు రేవంత్ వైపు మొగ్గు చూపారనే మేటర్ సైతం బయటకు లీక్ కావడంతో , ఆయనకు పదవి రాబోతోంది అనే విషయంపై చర్చ నడుస్తోంది.
కాకపోతే పాదయాత్ర విషయమై అధికారిక ప్రకటన చేయడం ఆషామాషీగా అయితే జరగలేదని , ఖచ్చితంగా పార్టీ అధిష్టానం ఈ విషయాన్ని రేవంత్ కు సూచనప్రాయంగా తెలియజేయ బట్టే ఆయన ఇంత ధైర్యంగా పాదయాత్ర ప్రకటన చేసినట్లు ప్రచారం జరుగుతోంది.