తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పది రోజుల పాటు చైనా పర్యటనకు వెళ్లారు కదా…! ఎందుకు వెళ్లారు? ప్రధానంగా తెలంగాణకు పెట్టుబడులు తీసుకురావాలనే ఉద్దేశంతో వెళ్లారని అందరూ అనుకుంటున్నారు.‘అమ్మయినా అడగందే పెట్టదు’ అనే సామెత ఉంది.మరి చైనా వాళ్లు మనం పోయి అడగందే డబ్బులు ఇస్తారా? ఇవ్వరు కదా.అందుకే కేసీఆర్ వెళ్లారు.కాని కాంగ్రెసు మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ‘కేసీఆర్ చైనాకు ఎందుకు వెళ్లాడు?’ అని ప్రశ్నించారు.ఎందుకు వెళ్లారో అర్థం కాక కాదు.
తెలంగాణలో కరువు పరిస్థితి ఏర్పడిందని, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, ఈ పరిస్థితిలో చైనాకు పోకపోతే ఏం మునిగిపోయిందని పొన్నం ప్రశ్నిస్తున్నారు.దేశం ఆర్థిక పరిస్థితి బాగాలేకపోవడంతో క్లిష్ట పరిస్థితిలో ఉందని, షేర్ మార్కెటు కూడా కుప్ప కూలిందని (అందుకు చైనా కారణమని అభిప్రాయం) ఈయన అక్కడికి పోయి ఏం చేస్తారని పొన్నం సందేహం.
అంటే కేసీఆర్ చైనాకు వెళ్లి సాధించుకువచ్చేది ఏదీ లేదని చెప్పడమన్న మాట.అందులోనూ ప్రయాణ ఖర్చులకే రెండున్నర కోట్లు ఖర్చు చేయడంపై పొన్నం మండిపడ్డారు.పొన్నం ఆవేదన కరెక్టే ఉండొచ్చుగాని, కేసీఆర్ సొంతంగా ప్రయాణానికి ఇన్ని కోట్లు ఖర్చు చేయరు కదా.ఆయనకు చైనా పర్యటన మర్చిపోలేని అనుభవంగా ఉంటుంది.తాను చైనాకు పోకుండా ఉంటే రైతుల ఆత్మహత్యలు ఆగుతాయా? అని అనుకొని ఉండొచ్చు.