ఈ ఏడాది ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి ఎంతో మంది ప్రముఖుల ప్రాణాలు గాలిలో కలిపేసింది.సెలబ్రెటీలు,రాజకీయ, వ్యాపార ప్రముఖుల ప్రాణాలు బలి తీసుకుంది.
ఏది ఏమైనా ఎంతో మంది ప్రముఖులు ఈ ఏడాది మన మధ్య నుంచి అకస్మాత్తుగా ఈ కరోనాతో దూరమయ్యారు.తాజాగా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అహ్మద్ పటేల్ కరోనా బారిన పడి కన్నుమూశారు.
నెల రోజుల కిందట కరోనా బారినపడిన అహ్మద్ పటేల్ కోలుకోలేకపోయారు.గుర్గావ్ లోని మేదాంత ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ తెల్లవారుజామున 71 సంవత్సరాల అహ్మద్ పటేల్ తుదిశ్వాస విడిచారు.
అహ్మద్ పటేల్ మృతి విషయాన్ని ఆయన కుమారుడు ఫైజల్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.
కరోనా ప్రభావంతో శరీరంలో అవయవాలు బాగా దెబ్బతినడమే ఆయన మరణానికి దారితీసినట్టు కుటుంబ సభ్యులు వెల్లడించారు.
ఆయనకు ఈ నెల 15 నుంచి అత్యవసర చికిత్స అందిస్తున్నారు.సీనియర్ నేత ఇలా కరోనాతో మృతి చెందడంతో కాంగ్రెస్ పార్టీలో కూడా విషాదచాయలు అలుముకున్నాయి.ప్రస్తుతం ఈయన రాజ్యసభ సభ్యుడిగా, కాంగ్రెస్ పార్టీ జాతీయ కోశాధికారిగా ఉన్నారు.ఇప్పటివరకు మూడు సార్లు లోక్ సభకు, ఐదుసార్లు రాజ్యసభకు ఆయన ఎన్నికయ్యారు.1976లో గుజరాత్ లోని బరూచ్ లో జరిగిన స్థానిక ఎన్నికల ద్వారా ఆయన రాజకీయ రంగంలో అడుగుపెట్టారు.అక్కడ్నించి అంచెలంచెలుగా ఎదుగుతూ రాష్ట్రంలోనే కాకుండా జాతీయ స్థాయిలోనూ కాంగ్రెస్ లో తన విశిష్టత చాటుకున్నారు.
ఆయన మృతి పట్ల కేవలం కాంగ్రెస్ పార్టీ ప్రముఖులు మాత్రమే కాకుండా దేశ ప్రధాని నరేంద్ర మోడీ కూడా దిగ్బ్రాంతి వ్యక్తం చేసి సంతాపం తెలియజేశారు.