హుజూరాబాద్ నియోజకవర్గం లో జరుగుతున్న ఉప ఎన్నికల్లో ఏ పార్టీకి ఆ పార్టీ విజయంపై ధీమా గా ఉన్నాయి.ముఖ్యంగా బిజెపి, కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో నువ్వా నేనా అన్నట్లు గా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ, దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి.
టిఆర్ఎస్ నుంచి గెల్లు శ్రీనివాస్ యాదవ్, బిజెపి నుంచి ఈటెల రాజేందర్, కాంగ్రెస్ నుంచి బల్మూరి వెంకట్ లు పోటి పడుతున్నారు.అయితే ఎన్నికల ప్రచారం విషయంలో కి వచ్చేసరికి టీఆర్ఎస్, బీజేపీలు దూకుడుగా ముందుకు వెళ్తున్న , కాంగ్రెస్ ఇంకా ఎన్నికల మూడ్ లోకి వచ్చినట్టుగా కనిపించడం లేదు.
మరోవైపు చూస్తే పోలింగ్ తేదీ దగ్గరకు వచ్చేస్తోంది.అయినా కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం పై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టలేదు.
ఇక ఈ నియోజకవర్గంలో పరిస్థితి చూసుకుంటే ఈటెల రాజేందర్ కు ఈ నియోజకవర్గంలో గట్టి పట్టు ఉండటం, టిఆర్ఎస్ ప్రభుత్వం పై పెరుగుతున్న వ్యతిరేకత , రాజేందర్ పై ఉన్న సానుభూతి ఇవన్నీ బీజేపీకి కలిసొచ్చే అంశాలే.
టిఆర్ఎస్ దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టి ఈ నియోజకవర్గంలో కీలకంగా ఉన్న దళిత సామాజిక వర్గం ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది.
అంతేకాకుండా ఇప్పటికే మంత్రులు ఎమ్మెల్యేలను రంగంలోకి దించి ఈ నియోజకవర్గం పట్టు సాధించేలా టీఆర్ఎస్ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.అయితే ఈ రేసులో కాంగ్రెస్ మాత్రమే బాగా వెనుకబడినట్టు కనిపిస్తోంది.
ఈ నియోజకవర్గంలో బలమైన నేతను పోటీకి కాంగ్రెస్ దించుతుంది అని అంతా అనుకున్నా, కాంగ్రెస్ మాత్రం ఎన్ ఎస్ యు ఐ రాష్ట్ర అధ్యక్షుడిగా రెండుసార్లు పనిచేసిన బల్మూరి వెంకట్ అనే విద్యార్థి నాయకుడు ని పోటీకి దించింది.టిఆర్ఎస్ నుంచి విద్యార్థి నాయకుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ కు పోటీగా కాంగ్రెస్ వెంకట్ ను దింపినా, ప్రచారం విషయంలో మాత్రం బాగా వెనకబడిపోయింది.ఈ నియోజకవర్గంలో త్రిముఖపోటీ ఉంటుందని అంతా అంచనా వేసినా, ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే బీజేపీ టీఆర్ఎస్ మధ్య పోటీ ఉన్నట్లుగా కనిపిస్తోంది.
.