అసలు తమ పార్టీ పరిస్థితి ఏమిటి ? పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చేందుకు ఏ విధంగా తమ వంతు కృషి చేయాలి.అధికార పార్టీ హవాను ఏ విధంగా అడ్డుకోవాలి వంటి విషయాలపై ఫోకస్ పెట్టకుండా, పూర్తిగా గ్రూపు రాజకీయాలకే పరిమితం అయిపోయి, స్వ పక్షంలోని నాయకులే విపక్షం మాదిరిగా ఒకరికొకరు వెన్నుపోటు పొడుచుకునే రాజకీయాలు ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కనిపిస్తున్నాయి.
పిసిసి అధ్యక్ష పదవి సంపాదించే విషయంలో సీనియర్ నాయకులంతా పోటీలు పడుతున్నారు.అనేక మార్లు ఢిల్లీకి వెళ్లి మరీ అధిష్టానం పెద్దలను ప్రసన్నం చేసుకునే పనికి శ్రీకారం చుడుతున్నారు.
అలాగే తమకు పలుకుబడి ఉన్న నాయకుల ద్వారా కాంగ్రెస్ హైకమాండ్ పై ఒత్తిడి పెంచే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.పిసిసి అధ్యక్ష పదవి భర్తీ చేసేందుకు కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి ద్వారా వివరాలు సేకరించింది.
మెజార్టీ నాయకుల అభిప్రాయం మేరకు రేవంత్ రెడ్డి వైపు ఎక్కువ మంది మొగ్గు చూపుతుండగా, సీనియర్లు మాత్రం ఆయన నాయకత్వంలో తాము పని చేయలేమని ఖరాకండిగా అధిష్టానానికి తెలియజేస్తున్నారు.దీంతో రేవంత్ పేరు కు ప్రత్యామ్నాయంగా కోమటిరెడ్డి వెంకట రెడ్డి పేరూ గట్టిగానే వినిపించింది.
ఆయన ఢిల్లీకి వెళ్లి మరీ సోనియాను కలిసి రావడంతో ఆయనకి పీసీసీ అధ్యక్షా పదవి అనే ప్రచారం జరిగింది.ఇదిలా ఉంటే దుద్దిళ్ల శ్రీధర్ బాబు, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి, వి హనుమంత రావు వంటి నాయకులు తమకి పదవి ఇవ్వాలంటూ అధిష్టానంపై ఒత్తిడి పెంచుతున్నారు.ఇక కాంగ్రెస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు ,ఎమ్మెల్సీలు, ఎంపీలు ఇలా అందరూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేరుని ప్రస్తావిస్తూ ఉండగా, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ,ములుగు ఎమ్మెల్యే సీతక్క వంటివారు రేవంత్ రెడ్డి పేరును ప్రతిపాదిస్తున్నారు.దీంతో అధిష్టానం కు ఈ వ్యవహారం తలనొప్పిగా మారింది.
తాజాగా సీఎల్పీ లీడర్ మల్లు బట్టి విక్రమార్క పేరు ఢిల్లీ పెద్దల వద్ద తెరపైకి వచ్చింది.ఆయన పేరు ఢిల్లీ అధిష్టానం పెద్దల వద్ద ఎక్కువగా వినిపిస్తోంది.
ఆయనకి పదవి ఇవ్వబోతున్నారు అనే ప్రచారం ఊపందుకున్న తరుణంలో, అకస్మాత్తుగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఢిల్లీకి వెళ్లి పిసిసి అధ్యక్ష పదవి కోసం పడుతున్నట్లు తెలుస్తోంది.మొన్నటి వరకు పదవి ఎవరికి ఇచ్చినా కలిసి పని చేస్తామని చెప్పిన కోమటిరెడ్డి ఇప్పుడు మాత్రం తనకు పిసిసి అధ్యక్ష పదవి ఇవ్వకపోతే, తనదారి తాను చూసుకుంటానని, పార్టీ మారేందుకు కూడా వెనుకాడబోనని హెచ్చరికలక అధిష్టానం పెద్దలు చేయబోతున్నట్లు తెలుస్తోంది.
అలాగే రేవంత్ రెడ్డి సైతం తెలంగాణ పిసిసి అధ్యక్ష పదవి ఇవ్వకపోతే కాంగ్రెస్ లో ఉండేది లేదని, సొంతంగా పార్టీ పెట్టి బయటకి వెళ్తాను అని మీడియాకు లీకులు ఇస్తుండడం వంటి వ్యవహారాలు చూస్తే, ఈ వ్యవహారంలో ఎవరికి పదవి ఇచ్చినా పెద్దఎత్తున పార్టీ నుంచి వలసలు ఉండే అవకాశం ఉండడంతో కాంగ్రెస్ అధిష్టానం ఒత్తిడికి ఒత్తిడికి గురవుతున్నట్టు తెలుస్తోంది.