తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కి కొత్త అధ్యక్షుడిని నియమించడం ద్వారా, ఆ పార్టీకి కలిగే ప్రయోజనం ఎంతో తెలియదు కానీ, ఆ పార్టీలో చోటుచేసుకుంటున్న పరిణామాలు మాత్రం అందరికీ ఆసక్తిని కలిగిస్తున్నాయి.ముఖ్యంగా తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి పేరు మొదటి నుంచి వినిపిస్తూనే ఉంది.
ఆయనకు ఆ పదవిని కట్టబెట్టేందుకు కాంగ్రెస్ అధిష్టానం సైతం ఆసక్తిగా ఉంది.ఆయనకు ఆ పదవి ఇవ్వడం ద్వారా, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మంచి ఊపు వస్తుందని, కార్యకర్తల్లో ఉత్సాహం పెరిగే విధంగా రేవంత్ చేయగలరు అని ,ఆయన ఆధ్వర్యంలోని తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగలదు అనే నమ్మకం కాంగ్రెస్ అధిష్టానం పెద్దల్లో ఉంది.
కానీ తమ ఆలోచన ప్రకారం వెంటనే పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి పేరును ప్రకటిస్తే, పార్టీలో తలెత్తే పరిణామాలను తలచుకుని కాంగ్రెస్ అధిష్టానం ఆందోళన చెందుతోంది.
ముఖ్యంగా సీనియర్ నాయకులు రేవంత్ నాయకత్వం ను ఒప్పుకోకపోవడం, తమకంటే జూనియర్ అయిన రేవంత్ ఆధ్వర్యంలో తాము పని చేసేది లేదు అంటూ చెప్పడం వంటి కారణాలతో తమ నిర్ణయాన్ని వాయిదా వేసుకుంటూ వస్తోంది.
మరోవైపు తెలంగాణలో బిజెపి బాగా బలం పెంచుకోవడం, తమకే సవాలు విసిరే స్థాయికి వెళ్లడం, కాంగ్రెస్ లో అసంతృప్తి నాయకులు అందరిని గుర్తించి, తమ పార్టీలో చేర్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్న సమయంలో పిసిసి అధ్యక్షుడి ఎంపిక చేపట్టి, అనవసరంగా కొత్త చిక్కులు తెచ్చుకోవడం ఎందుకనే ఆలోచన లో కేంద్రం ఉంది.అయితే ఇప్పుడు కాకపోతే మరి కొంతకాలం తరువాత అయినా ఈ పదవిని భర్తీ చేయాల్సి ఉండటంతో, ఈ మొదటివారంలోనే కొత్త అధ్యక్షుడు పేరు ప్రకటించేందుకు సిద్ధం అవుతున్నారు.
ఇదిలా ఉంటే ప్రస్తుతం బీజేపీ కుల రాజకీయాలకు తెర తీయడం ,బీసీలను ఎక్కువగా హైలెట్ చేసుకుంటూ వారి మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నిస్తోంది.తెలంగాణ బిజెపి అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్ బీసీ సామాజిక వర్గానికి చెందినవారు కావడంతో, తెలంగాణ పీసీసీ అధ్యక్ష పదవి బీసీలకు ఇస్తే ఎలా ఉంటుందనే ఆలోచన కూడా చేస్తోంది.అలాగే ఎస్సీ సామాజిక వర్గానికి ఇస్తే పార్టీకి ఎంతవరకు కలిసి వస్తుంది అనే విషయం పైన దష్టి పెట్టింది.బిసి, రెడ్డి , ఎస్సీ ఈ మూడు కులాల్లో ఎవరికి పదవి ఇస్తే ఎక్కువ లాభం కలుగుతుంది అనే విషయంపైన ఇప్పుడు అంతర్గతంగా సర్వే చేస్తున్నట్లు సమాచారం.
పార్టీ నేతల అభిప్రాయాలు, కుల లెక్కలు బిజెపి బలం ఇవన్నీ లెక్క చూసుకుని అప్పుడు పీసీసీ కొత్త అధ్యక్షుడి పేరును ప్రకటించాలని చూస్తోంది.అందుకే ఇంకా లేట్ అయినా, సరైన ఫార్ములాతో కొత్త పిసిసి అధ్యక్షుడిని నియమించాలని కాంగ్రెస్ అధిష్టానం డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.