తెలంగాణ కాంగ్రెస్ లోని గండాలు, సుడిగుండాలు ఎన్నో దాటుకుంటూ ముందడుగు వేస్తున్నారు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్ రెడ్డి.పార్టీ అధిష్టానం ఆశీస్సులు పుష్కలంగా ఉన్నా, తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకులు తరుచుగా రేవంత్ రెడ్డి ని టార్గెట్ చేసుకుంటూ రాజకీయాలు చేస్తూ వస్తున్నారు.
అధిష్టానం తమ కంటే ఎక్కువగా ఆయనకి ప్రాధాన్యం ఎక్కువగా ఇవ్వడం, రానున్న రోజుల్లో కీలకమైన పదవులు అప్పగించేందుకు చూస్తుండటం, అలాగే తెలంగాణ కాంగ్రెస్ సీఎం అభ్యర్థిగా రేవంత్ పేరు ప్రచారంలోకి వస్తుండడం వంటివి సీనియర్ లకు మింగుడు పడడం లేదు.అయినా రేవంత్ మాత్రం అవేమి పట్టిన్చుకోకుండా తాను అనుకున్న లక్షాన్ని చేరేందుకు ప్రయత్నాలు చేస్తూనే వస్తున్నారు.
రేవంత్ ఇటీవల మినీ పాదయాత్ర నిర్వహించారు.ఈ పాదయాత్రను ప్రధాన మీడియా సరిగ్గా పట్టించుకోకపోయినా, కాంగ్రెస్ సీనియర్ నాయకులు సహకరించకపోయినా, ఆ యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు.
అలాగే ఎంతో మంది పార్టీ నాయకులు, యువత రేవంత్ కు మద్దతుగా నిలబడ్డారు.
అసలు రేవంత్ పాదయాత్రకు కాంగ్రెస్ అధిష్టానం అనుమతి లేదని సీనియర్ నాయకులు ప్రచారం చేసినా, రేవంత్ పాదయాత్ర సభను అడ్డుకునేందుకు రకరకాల మార్గాల్లో ప్రయత్నాలు చేసినా, చివరకు అది సక్సెస్ అయింది.
దీంతో మరింత ఉత్సాహంతో తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్ర చేయాలని ప్లాన్ చేసుకుంటున్నారు దీనికి అధిష్టానం అనుమతి తీసుకోవాలని చూస్తున్నారు.ఏదో రకంగా పార్టీకి మంచి ఊపు తీసుకొచ్చి రానున్న రోజుల్లో పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చే ప్లాన్ తో ఆయన ముందుకు వెళ్తుండగా, రేవంత్ కు పోటీగా ఇప్పుడు పార్టీ సీనియర్లు సైతం పాదయాత్ర చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు.
ఆయనకు వ్యతిరేకంగా పార్టీ అధిష్టానం వద్ద ఫిర్యాదులు సైతం చేస్తున్నారు.అయినా కాంగ్రెస్ అధిష్టానం మాత్రం సీనియర్ నాయకుల ఫిర్యాదులను పట్టించుకునే స్థితిలో లేదు.
కేవలం రేవంత్ మాత్రమే పార్టీకి తిరిగి పునర్వైభవం తీసుకు రాగలరని కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఉన్నా, వారి వల్ల పార్టీ ఆశించినంత స్థాయిలో కలిసి వచ్చేది ఏమీ లేదు అనే అభిప్రాయం అధిష్టానం పెద్దల్లో ఉండడం ఇలా ఎన్నో కారణాలతో రేవంత్ నిర్ణయాలకు అధిష్టానం మద్దతు ఇస్తూ వస్తోంది.మరింతగా రేవంత్ ప్రోత్సహిస్తేనే తాము అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవచ్చ అనేది అధిష్టానం పెద్దల ఆలోచన.అందుకే రేవంత్ పై ఫిర్యాదులు వచ్చినా, పట్టించుకునే పరిస్థితిలో కాంగ్రెస్ అధిష్ఠానం పెద్దలు లేరు.ఇవన్నీ రేవంత్ కు కలిసి వస్తుండగా, సీనియర్ లీడర్ల రాజకీయానికి చెక్ పడుతున్నట్లుగా ప్రస్తుత వ్యవహారాలు కనిపిస్తున్నాయి.