ఈ సంవత్సరం మార్చి నెలలో సూయజ్ కాలువలో అడ్డంగా చిక్కుకుపోయింది ఎవర్గివెన్ అనే భారీ సరకు రవాణా నౌక.దాంతో ఆ మార్గంలో కొన్ని రోజుల పాటు జల రవాణా ఆగిపోయింది.రోజుకు దాదాపు రూ.70 వేల కోట్ల నష్టం వచ్చినట్లు అంచనా వేశారు.దాదాపు వారం రోజుల పాటు శ్రమించి ఈ నౌకను కాలువకు అడ్డు తప్పించారు.అయితే, అక్కడి నుంచి వెళ్లిపోవడానికి, తిరిగి ప్రయాణం ప్రారంభించడానికి ఈ నౌకకు సూయజ్ కెనాల్ అథారిటీ అయిన ఎస్సీఏ అనుమతి ఇవ్వలేదు.
ఈ నౌక సూయజ్ కాలువలో ఆగిపోవడం వల్ల ఆ మార్గంలో జల రవాణాకు ఆటంకం కలిగింది.దానికి నష్టపరిహారం చెల్లిస్తేనే నౌకను అక్కడి నుంచి కదలనిస్తామని సూయజ్ కెనాల్ అథారిటీ ఎస్సీఏ స్పష్టం చేసింది.
ఆ మార్గంలో జల రవాణా ఆగిపోవడం వల్ల కలిగిన నష్టానికి పరిహారం చెల్లించాలంటూ సూయజ్ కెనాల్ అథారిటీ ఈజిప్ట్ కోర్టులో దావా వేసింది.91.6 కోట్ల అమెరికన్ డాలర్ల పరిహారం చెల్లించాలని ఎస్సీఏ కోరింది.అనంతరం ఆ మొత్తాన్ని 55 కోట్ల డాలర్లకు తగ్గించింది.
అయితే, నష్ట పరిహారం చెల్లించడంపై నౌక యాజమాన్య సంస్థ, బీమా కంపెనీ మధ్య పీఠముడి పడింది.ఈ డబ్బు ఎవరు చెల్లించాలనే విషయంలో ఎవర్గివెన్ నౌక యజమాని జపాన్ కు చెందిన షోయీ కిసెన్, బీమా కంపెనీలు కోర్టును ఆశ్రయించాయి.
దాదాపు మూడు నెలల తర్వాత ఎట్టకేలకు నౌక యాజమాన్య సంస్థ, బీమా కంపెనీల మధ్య ఆదివారం ఒక ఒప్పందం కుదిరింది.దాంతో ఎవర్గివెన్ నౌక సూయజ్ కాలువ నుంచి కదలడానికి కెనాల్ అథారిటీ నుంచి అనుమతి లభించింది.వారం రోజుల పాటు సూయజ్ కెనాల్ లో నౌక చిక్కుకుపోవడంతో సుమారు రూ.70 వేల కోట్ల నష్టం వాటిల్లిందని, పరిహారంగా తమకు 916 మిలియన్ల అమెరికన్ డాలర్లను చెల్లించాలని ఎస్సీఎ దావా వేసినట్లు తెలుస్తోంది.