ఏ పార్టీకైనా ఎన్నికల్లో అభ్యర్థులను ఎంపిక చేయడం కత్తి మీద సామే.కులం, మతం, ఆర్థిక బలం, వర్గం…ఇలాంటివి ఎన్నో చూసుకోవాలి.
ఎన్ని సమీకరణాలు చూసుకున్నా, ఎన్ని లెక్కలు వేసుకున్నా అంతిమంగా ఓట్లు పడటం, అభ్యర్థులు గెలవడమే ప్రధానం.సాధారణ ఎన్నికల్లో (అసెంబ్లీ, పార్లమెంటు) అభ్యర్థుల ఎంపికపై ఆపసోపాలు పడటం సహజం.
కాని ఉప ఎన్నిక కూడా తలనొప్పిగా మారితే ఏమనుకోవాలి? ప్రస్తుత రాజకీయాల్లో ఉప ఎన్నికను సైతం పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి.ఒక ఉప ఎన్నిక గెలుపు ఊపిరి పోస్తుంది.
ఓటమి లేవనీయకుండా చేస్తుంది.ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెసు పార్టీకి ఇలాంటి గడ్డు పరిస్థితి ఏర్పడింది.
వరంగల్ పార్లమెంటరీ స్థానం ఉప ఎన్నికకు అభ్యర్థిని ఎంపిక చేయడంపై ఆ పార్టీ నాయకత్వం విపరీతంగా కసరత్తు చేస్తోంది.ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రిగా ఉన్న కడియం శ్రీహరి ఈ స్థానంలో ఎంపీగా ఉండేవారని తెలుసు.
ఆయన రాజీనామా చేసి మంత్రివర్గంలో చేరడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది.ఈ స్థానాన్ని అన్ని పార్టీలు ‘పరువు’ సమస్యగా తీసుకున్నాయి.
టీఆర్ఎస్ అధికార పార్టీ కాబట్టి దానికి పెద్దగా చింత లేదు.గెలుపుపై ధీమా ఉంది.
ప్రస్తుతం కాంగ్రెసు, భాజపా-టీడీపీ కూటమే గెలుపు కోసం తాపత్రయపడుతున్నాయి.వాటి ఉనికిని కాపాడుకోవాలంటే ఇక్కడ గెలుపు తప్పనిసరి.
కడియం శ్రీహరి అత్యంత వెనకబడిన బైండ్ల కులస్తుడు.ఇది షెడ్యూల్డు కులాలకు రిజర్వుడు కాబట్టి ఆ సామాజిక వర్గాల నుంచే బలమైన అభ్యర్థిని నిలబెట్టాలి.
కాంగ్రెసు పార్టీకి తెలంగాణలో ఎవరూ అభ్యర్థి కనబడటంలేదట….! దీంతో యూపీఏ పాలనలో లోక్సభ స్పీకర్గా పనిచేసిన మీరా కుమార్ను నిలబెట్టాలని అనుకుంటున్నారు.
ఈమె ఒకప్పటి ప్రముఖ నాయకుడు జగ్జీవన్రామ్ కుమార్తె అనే సంగతి తెలిసిందే.ఆమెను కాంగ్రెసు అభ్యర్థిగా నిలబెడితే గెలుపు తథ్యమని భావిస్తున్నారు.ఈమె పేరు ఎప్పటి నుంచో ప్రచారంలో ఉన్నా ఇంకా కసరత్తు సాగుతూనే ఉంది.వామపక్షాలు ప్రజా గాయకుడు గద్దర్ను నిలబెట్టాలని ప్రతిపాదించడంతో కాంగ్రెసుకు మరింత భయం పెరిగింది.
గద్దర్ తెలంగాణలో ప్రముఖ వ్యక్తి.చాలామందికి అభిమాన గాయకుడు.
ఒక్కమాటలో చెప్పాలంటే వాగ్గేయకారుడు.ఆయన వామపక్షాల అభ్యర్థి అయితే మాత్రం గెలుపుకు అవకాశం ఉంటుందని అనుకుంటున్నారు.
గద్దర్ నిలబడితే టీఆర్ఎస్కూ భయమే.టీఆర్ఎస్ను ఓడించాలంటే గద్దర్కు మద్దతు ఇవ్వాలని కొందరు కాంగ్రెసు నాయకులు అంటున్నట్లు సమాచారం.
అంటే కాంగ్రెసు తరపున అభ్యర్థి అక్కర్లేదని ఉద్దేశం.కాని కాంగ్రెసు పోటీ చేయాల్సిందేనని కొందరు అంటున్నారు.
ప్రతిపక్షాలన్నీ కలిసి (కాంగ్రెసు, కమ్యూనిస్టులు, భాజపా, టీడీపీ) అభ్యర్థిని నిలబెడితే టీఆర్ఎస్ ఓడిపోవడం గ్యారంటీ అని, అలా కాకుండా ఏ పార్టీకా పార్టీ అభ్యర్థులను నిలబెడితే టీఆర్ఎస్ గెలుపు సునాయాసంగా ఉంటుందని కొందరు నాయకులు అభిప్రాయపడుతున్నారు.టీఆర్ఎస్ను ఓడించడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకోవాలంటున్నారు.
టీడీపీ-భాజపా కూటమి ఇంకా అభ్యర్థిని నిర్ణయించలేదు కాబట్టి అప్పటదాకా వేచి చూసి నిర్ణయం తీసుకుందామని మరి కొందరు కాంగ్రెసు నాయకులు చెబుతున్నారు.ఏది ఏమైనా మీరా కుమార్ పేరు మాత్రం ఇప్పటికీ పరిశీలనలోనే ఉంచారు.
చూడాలి మరి ఏం చేస్తారో….!