తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రోజురోజుకు బలపడేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నిస్తోంది.ఉమ్మడి రాష్ట్రంలో అత్యంత బలమైన పార్టీగా ఉన్న కాంగ్రెస్ పార్టీ కాలక్రమేణా స్వయం కృతాపరాధంతో పార్టీ ప్రజల్లో పలుచన అయ్యేలా నేతల వ్యవహరించడంతో కాంగ్రెస్ పార్టీ బలహీనంగా మారింది.
తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ ఇచ్చినా ఆ క్రెడిట్ ని కాంగ్రెస్ వైపు మళ్లించుకోవడంలో విఫలం కావడంతో కాంగ్రెస్ పార్టీ గత రెండు సార్వత్రిక ఎన్నికల్లో అంతగా ఆశించిన ఫలితాలు మాత్రం రాలేదనే విషయం తెలిసిందే.దానికి తోడు కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కలహాలు ప్రజల్లో కాంగ్రెస్ ప్రతిష్టను మరింతగా దిగజార్చిన పరిస్థితి ఉంది.
ఇక చాలా నాటకీయ పరిణామాల అనంతరం కాంగ్రెస్ పీసీసీ చీఫ్ గా ఉన్న ఉత్తమ్ స్థానంలో ఎంపీ రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ అధిష్టానం పీసీసీ చీఫ్ గా నియమించిన విషయం తెలిసిందే.అయితే రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ గా నియామకం అయిన తరువాత కాంగ్రెస్ సీనియర్ లు, రేవంత్ రెడ్డికి మధ్య కోల్డ్ వార్ జరిగిన విషయం తెలిసిందే.
ప్రస్తుతం కాంగ్రెస్ లో జగ్గారెడ్డి వ్యవహారం పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది.
కాంగ్రెస్ లో ఉంటూనే రేవంత్ రెడ్డిపై ఏకంగా విలేఖరుల సమావేశంలోనే బహిరంగంగా విమర్శలు చేయడంతో కాంగ్రెస్ లో జగ్గారెడ్డి వ్యవహారం చాలా కన్ఫ్యూజన్ గా మారింది.అయితే తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలను కూడా ఖండిస్తూ నేను కాంగ్రెస్ వాదినని, నా రక్తం కాంగ్రెస్ రక్తమని చెబుతూనే స్వంత పార్టీపై కామెంట్స్ చేస్తుండటంతో కాంగ్రెస్ నాయకులే ఏమి వ్యాఖ్యానించలేని పరిస్థితి ఉంది.ఏది ఏమైనా జగ్గారెడ్డి వ్యవహారం పట్ల ఇప్పటికే అధిష్టానానికి ఫిర్యాదులు అందిన నేపథ్యంలో అధిష్టానం స్పందిస్తుందా లేదా అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.