తెలంగాణ కాంగ్రెస్ రోజురోజుకు బలపడేందుకు ప్రయత్నిస్తున్న పరిస్థితి ఉంది.టీఆర్ఎస్ పార్టీ తరువాత ప్రత్యామ్నాయ పార్టీగా ఎదగాలని ప్రయత్నిస్తున్న పరిస్థితిలో బీజేపీ నుండి పెద్ద ఎత్తున పోటీ నెలకొంటున్న పరిస్థితిని చూస్తున్నాం.
అయితే ఇంకా సార్వత్రిక ఎన్నికలకు రెండున్నర సంవత్సరాలు మాత్రమే సమయం ఉండటంతో ఇప్పటి నుండి ఎన్నికలకు సన్నద్దమయితేనే ఎంతో కొంత మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది.అలా మెరుగైన ఫలితాలు రావాలంటే పార్టీలో అందరూ కలిసి ఒకే వ్యూహంతో ఒకే లక్ష్యంతో పనిచేస్తేనే మెరుగైన ఫలితాలు వస్తాయి.
కాని ప్రస్తుతం కాంగ్రెస్ లో అందరూ కలిసి పనిచేసే పరిస్థితులు మరల కనిపించడం లేదు.గత నెలలో ఇందిరాపార్క్ వద్ద జరిగిన ధర్నాలో ఐక్య రాగం వినిపించడంతో కాంగ్రెస్ లో కలహాలన్నీ తొలగి పోయాయని అందరూ భావించారు.
కాని ఇంకా కలహాలు తొలగి పోలేదని కాంగ్రెస్ లో జరుగుతున్న తాజా పరిణామాలను బట్టి మనకు అర్ధమవుతోంది.తాజాగా ఎర్రవెల్లిలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన రచ్చబండ కార్యక్రమంపై సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగిన విషయం తెలిసిందే.
రేవంత్ రెడ్డి చేసే ప్రతి పనిని సమర్థించబోమని, మంచి పని చేస్తే మద్దతిస్తామని, సరైన నిర్ణయం తీసుకోకుంటే మద్దతివ్వబోమని ఏకంగా మీడియా సమావేశంలోనే తెలపడంతో ఇంకా కాంగ్రెస్ లో కోల్డ్ వార్ కొనసాగుతోందని జరుతున్న ప్రచారానికి మరింత బలం చేకూరినట్టయింది.అయితే జగ్గారెడ్డి రేవంత్ రెడ్డిమీద ఫైర్ కావడానికి బలమైన కారణం ఉన్నట్లు తెలుస్తోంది.
సంగారెడ్డి నియోజకవర్గంలో కావచ్చు, జిల్లాలో కావచ్చు రేవంత్ రెడ్డి తనకు అడ్డు వస్తున్నాడని దీంతో ఈ విషయంలో రేవంత్ రెడ్డికి జగ్గారెడ్డికి మధ్య గ్యాప్ పెరిగిందని తెలుస్తోంది.అంతేకాక రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా సోనియా గాంధీకి జగ్గారెడ్డి లేఖ రాయడం ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలో ఆసక్తికరంగా మారింది.