సాధినేని యామిని శర్మ ఈ పేరు రాజకీయాల్లో తెలియని వారు ఉండరేమో.ఆమె రాజకీయాల్లోకి కొత్తగా వచ్చినా పదునైన వాగ్ధాటితో అన్ని పార్టీల దృష్టిలో పడ్డారు.
అందుకే ఆమె టీడీపీలో అతి తక్కువ సమయంలో ఎక్కువ గుర్తింపు తెచ్చుని అధికార ప్రతినిధి వరకు ఎదిగారు.టీడీపీ ప్రభుత్వంలో ఆమె ప్రభుత్వం పై ఏ చిన్న విమర్శ వచ్చినా ఆమె ముందుగా స్పందించి ప్రతివిమర్శలు చేసేవారు.
టీడీపీ కూడా ఆమెను అదే స్థాయిలో ప్రోత్సహించింది.అయితే ప్రస్తుతం టీడీపీ అనేక ఒడిదుడుకులు ఎదుర్కోవడం, వైసీపీ ప్రభుత్వం పై ఉన్న భయంతో చాలామంది కాషాయ జెండా కప్పుకోవడానికి మొగ్గు చూపుతున్నారు.
ఈ క్రమంలో యామిని చూపు కూడా బీజేపీ మీద పడినట్టు ప్రచారం మొదలయ్యింది.దీనికి బలం చేకూర్చేలా ఇటీవల ఆమె ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మి నారాయణ ను కలవడంతో ఆ ఊహాగానాలు నిజమే అని అంతా అనుకున్నారు.
దీనిపై ఎన్ని ఊహాగానాలు వస్తున్నా యామిని మాత్రం తాను టీడీపీలోనే ఉంటాను అని కానీ, బీజేపీలోకి వెళ్తాను అని కానీ స్పష్టంగా చెప్పకపోవడం గందరగోళానికి కారణం అవుతోంది.ఇక బీజేపీ కూడా ఈమె విషయంలో సానుకూలంగానే ఉంది.టీడీపీ నుంచి ఏ స్థాయి నేతలు వచ్చి చేరతామన్నా అడ్డు చెప్పకుండా తమ పార్టీలో చేర్చుకునేందుకు ఆసక్తిగానే ఉన్నారు.ఈ క్రమంలోనే టీడీపీకి చెందిన మహిళా నాయకురాలు, పార్టీ అధికార ప్రతినిధి సాధినేని యామిని శర్మ కూడా త్వరలోనే కమలం గూటికి చేరొచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ఈ విషయాన్ని పసిగట్టిన టీడీపీ అధినేత చంద్రబాబు ఆమెను పిలిపించి బుజ్జగించినట్టుగా తెలుస్తోంది.ఇప్పుడు పార్టీ మారడం వల్ల నీకు కలిసొచ్చేది ఏమి లేదని, పార్టీలోనే ఉంటే భవిష్యత్తులో కీలక పదవులు ఇస్తామంటూ ఆమెను ఒప్పించినట్టు తెలుస్తోంది.
అయితే ఈ విషయంలో ఆమె బాబు ముందు ఏమి మాట్లాడలేదని తెలుస్తోంది.
ఎన్నికల ఫలితాల తరువాత నుంచి యామిని పార్టీకి దూరంగానే ఉంటున్నారు.
అందువల్ల సహజంగానే ఆమె పార్టీ మారబోతున్నారనే ప్రచారం ఊపందుకుంది.పార్టీ మార్పుపై చంద్రబాబుతో మాట్లాడారా అనే ప్రశ్నలకు కూడా ఆమె క్లారిటీగా సమాధానాలు ఇవ్వడంలేదు.
దీన్ని బట్టి చూస్తే ఆమె పార్టీ మారే అవకాశాలే ఎక్కువగా ఉన్నట్టు అర్ధం అవుతోంది.టీడీపీ నాయకులు మాత్రం ఆమె పార్టీ మారే అవకాశమే లేదన్నట్టుగా కొట్టిపారేస్తున్నారు.
కానీ ఆమె కొంతకాలంగా ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణతో చర్చలు జరుపుతున్నారనీ త్వరలోనే ఆమె బీజేపీలో చేరడం ఖాయం అని గుంటూరు జిల్లా రాజకీయవర్గాల్లో టాక్ వినిపిస్తోంది.పార్టీ మార్పుపై ఎన్ని కథనాలు వస్తున్నా యామిని మాత్రం ఈ విషయంలో ఎటువంటి క్లారిటీ ఇవ్వకుండా సస్పెన్స్ కొనసాగిస్తున్నారు.