జనసేనలోకి వలసలు వెల్లువలా వచ్చి పడతాయని అనుకుంటే ఆ దాఖలాలు ఎక్కడా కనిపించడం లేదు సరి కదా, జనసేనకి భారీ స్థాయిలో మైలేజ్ తెచ్చే ఒక్క వలస కూడా జరగకపోవడం పవన్ కి ఊహించని పరిణామే.తన అన్న పార్టీ ప్రజారాజ్యం లోకి వచ్చినట్టుగా వలసలు వస్తాయని పవన్ భావించినా ఆ స్థాయిలో నేతలు రాకపోవడంతో పవన్ ఆశలపై నీళ్ళు జల్లినట్టే అయ్యింది.
ఇదిలాఉంటే.
అభ్యర్ధుల ఎంపిక కోసం ఏర్పాటు చేసిన స్క్రీనింగ్ కమిటి ముందు కొందరు నేతలు హాజరయ్యి పరీక్షలు రాసి, ఇంటర్వ్యూలని ఫేస్ చేయడం ఇప్పుడు ఆ పార్టీకి మరింత తలనెప్పి తీసుకువచ్చింది.
అసలు ఈ స్క్రీనింగ్ కమిటీ ఐడియా ఎవరు ఇచ్చారు అనే చర్చ కూడా జనసేనలో,అభిమానుల్లో జోరుగా జరుగుతోంది.జనసేన మైలేజ్ తగ్గించే చర్య ఈ స్క్రీనింగ్ కమిటీ ఏర్పాటు చేయడం అంటూ నేతలు పెదవి విరుస్తున్నారట.
ఇంతకీ ఈ స్క్రీనింగ్ కమిటి ఎందుకు వేశారు.దీనివల్ల అసలు ఉపయోగం ఉందా లేదా అనేది ఒక్క సారయినా పవన్ కళ్యాణ్ ఆలోచన చేశారా అంటూ చెవులు కొరుక్కుంటున్నారట నేతలు.
ఇదిగో ఆఖరు తేదీ, రెండు రోజులు పొడిగించాం అంటూ ప్రకటనలు చేస్తున్నా సరే ఒక్క కీలక నేత కూడా స్క్రీనింగ్ కమిటీ కి వెళ్లి పరీక్ష రాయలేదట.వివిధ పార్టీలలో ఉన్న అసంతృప్తి సీనియర్ మోస్ట్ లీడర్స్ ని ఆకట్టుకోవడం లో పవన్ పూర్తిగా విఫలం అయ్యారనే చెప్పాలి…అసలు తనకి తను మూడో ప్రత్యామ్నాయంగా చెప్పుకుంటున్న పవన్ కళ్యాణ్ వైపు ఏ నేతా కన్నెత్తి చూడక పోవడానికి కారణం ఏమిటి.అంటే పవన్ కళ్యాణ్ పై నమ్మకం లేకపోవడమే అనే టాక్ వినిపిస్తోంది.ఎన్నికలు అవ్వగానే తన అన్నలా పార్టీని విలీనం చేసేస్తాడో అనే భయం కొందరు నేతల్లో ఉందట.
ఈ కారణమే వలసలు రాకపోవడానికి ప్రధాన కారణం అంటున్నారు.
ఇదిలాఉంటే ఎంతో ప్రతిష్టాత్మకంగా పవన్ కళ్యాణ్ ఏర్పాటు చేసిన స్క్రీనింగ్ కమిటీ పవన్ పరువుని మరింత బజారుకు ఈడ్చింది అనే వాదన కూడా వినిపిస్తోంది.
ఎందుకంటే ఈ కమిటీ ఏర్పాటు చేసిన తరువాత ఒక్క కీలక నేత కూడా రాకపోవడంతో జనసేనలోకి ఎవరూ రావడం లేదు అసలు పార్టీ నిలదొక్కుకుంటుందా లేదా అందరూ కొత్త ముఖాలు అయితే ఎలా అనే ఆందోళన కలిగిస్తోందట.పైగా ఎవరెవరు స్క్రీనింగ్ కమిటీ ముందుకు వస్తున్నారో ఫోటోలతో సహా బయట పెట్టడంతో జనసేనకి అంత సీన్ లేదని తెల్చేస్తున్నారట.
సీనియర్ నేతలు కూడా పార్టీలోకి రావాలంటే మేము కూడా ఇలానే పరీక్షలు రాయాలా.?? టెస్ట్ లు పాసవ్వాలా.?? ఈ కమిటీ ముందు ఇంటర్వ్యూ కి హాజరవ్వాలా అనే కోణంలో ఆలోచనలు చేస్తున్నారట.ఇంతా బ్రతికి ఎదో అన్నట్టుగా జనసేనలోకి వెళ్ళక పోవడమే బెటర్ అనే నిర్ణయానికి వస్తున్నారట.
దాంతో ఈ విషయం తెలుసుకున్న కొందరు నేతలు అసలు ఎవరు ఈ స్క్రీనింగ్ కమిటీ ఏర్పాటు చేయమని చెప్పింది అంటూ కూపీ లాగుతున్నారట.రాజకీయం అంటే కొంత గోప్యత ఉండాలి, ఇది ప్రధమ సూత్రం కూడా మరి పవన్ ఆ విషయాన్ని విస్మరించారో ఆయనే ఆలోచించుకోవాలి అంటున్నారు విశ్లేషకులు.