వైసీపీ ప్రభుత్వ పనితీరు బాగానే ఉన్నా, జనాలలోను, పార్టీ నాయకులలోను ఏదో ఒక అసంతృప్తి అయితే బలంగా కనిపిస్తుంది.ఎన్నో సంక్షేమ పథకాలను జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న, గతంలో ఎప్పుడు ఇంత భారీ స్థాయిలో సంక్షేమ పథకాలు ఏపీలో అమలు కాలేదు.
దీంతో జగన్ క్రెడిట్ జనాల్లో పెరిగింది.ఈ విషయంలో జగన్ కు క్రెడిట్ దక్కుతుంది.
ప్రజాప్రతినిధుల ప్రమేయం పెద్దగా అవసరం లేకుండానే, అన్ని సంక్షేమ పథకాలను ప్రజల వద్దకు నేరుగా అందించే విధంగా ఒక ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేశారు.ఈ విధంగా ప్రజల్లో సంతృప్తి కలిగే విధంగా, రాబోయే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చే విధంగా జగన్ ప్లాన్ చేసుకున్నారు.
కాకపోతే జగన్ జనాల్లోకి రాకపోవడం, ఎక్కువగా తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి పరిమితమైపోతూ ఉండడంతో, పార్టీ నాయకుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది .వైసిపి ప్రతిపక్షంలో ఉన్న సమయంలో నిరంతరం జగన్ జనాల్లో ఉండే వారు .ప్రతి ప్రజా సమస్య పైన ఘాటుగా స్పందించి ఆందోళనలు, ఉద్యమాలు చేసేవారు.గల్లీ నుంచి ఢిల్లీ వరకు తన గొంతు వినిపిస్తూ జనాల్లోకి వైసీపీని తీసుకెళ్లడంలో అన్ని విధాలుగా సక్సెస్ అయ్యారు.
ఇక ఎన్నికలకు ముందు నిర్వహించిన పాదయాత్ర జగన్ ను జనాల్లోకి మరింత చేరువ చేసింది.అయితే జగన్ మాత్రం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి జనాల్లోకి వెళ్లేందుకు పెద్దగా ఇష్టపడలేదు .జనాల్లోకి రాకపోయినా అధికారుల ద్వారా అన్ని వ్యవహారాలను చక్క పెడుతున్నానని, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటున్నాను అనే భావంతో ఉన్నారు.
అయితే జగన్ జనాల్లోకి వస్తే వేరేగా ఉంటుంది అనే అభిప్రాయం పార్టీ నాయకుల్లో వస్తుంది.టీడీపీ అధినేత చంద్రబాబు అధికారంలో లేకపోయినా ,నిరంతరం ప్రజల లోనే ఉంటున్నారు.పార్టీ కోసం అహర్నిశలు పాటుపడుతున్నారు.
తన వయస్సు కూడా లెక్కచేయకుండా జనం బాట పడుతున్నారు.కానీ జగన్ మాత్రం ఈ విధంగా వ్యవహరించడం లేదు.
ఈ విషయమై టిడిపి కూడా విమర్శలు చేస్తోంది జగన్ వృద్ధుడని అందుకే జనాలలో తిరగలేక పోతున్నాడు అంటూ ఎద్దేవా చేస్తున్నారు.అయినా జగన్ మాత్రం ఈ విషయంలో పట్టించుకోనట్టుగా వ్యవహరిస్తున్నారు.2024 ఎన్నికల్లో వైసీపీకి గెలుపు దక్కాలి అంటే ఇప్పటి నుంచైనా జగన్ జనంలోకి రావాలని, ప్రభుత్వ పరంగా ఎటువంటి లోపాలు లేకుండా చూసుకుంటూ , క్షేత్ర స్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించే దిశగా అడుగులు వేయాలని, అధికారుల ద్వారా అన్ని విషయాలు తెలుసుకున్నా, జగన్ నేరుగా రంగంలోకి వస్తే ఫలితం ఉంటుందనే అభిప్రాయం పార్టీ నాయకుల్లో పెరుగుతోంది.