నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ మొదటిరోజు మూడుగంటలపాటు విచారించింది.ఈ నెల 25న మరో రౌండ్ సోనియాను ప్రశ్నించనున్నట్టు ఈడీ అధికారులు తెలిపారు.
ఆమేరకు సోనియాకు ఈడీ నోటీసులు అందించింది.సోనియా ఇటీవలే కోవిడ్ నుంచి కోలుకున్న నేపథ్యంలో ఆమెను విచారించే అధికారులందరికీ కోవిడ్ పరీక్షలు నిర్వహించి, నెగెటివ్ ఉన్నవారినే ఎంపిక చేశారు.
సోనియాను విచారించే సమయంలో కోవిడ్ నిబంధనలను ఈడీ అధికారులు పాటించారు.
నేషనల్ హెరాల్డ్కు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఈడీ ఎదుట ఈరోజు హాజరయ్యారు.
ఈ మధ్యాహ్నం తన నివాసం నుంచి బయల్దేరిన సోనియా వెంట ఆమె కుమార్తె ప్రియాంక గాంధీ ఉన్నారు.అటు రాహుల్ గాంధీ కూడా ఈడీ కార్యాలయానికి వెళ్లి కాసేపటి తర్వాత బయటకు వచ్చారు.
సోనియా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నందున ఆమెకు సహకారిగా ఉండేందుకు కూతరు ప్రియాంకకు ఈడీ అనుమతినిచ్చింది.కోవిడ్ లక్షణాలతో సోనియా ఇటీవల ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న విషయం తెలిసిందే.
సోనియా కోలుకున్నప్పటికీ.కోవిడ్ అనంతర సమస్యలతో ఆమె బాధపడుతున్నారు.
సోనియాగాంధీని దర్యాప్తు సంస్థ ఈడీ విచారించడం ఇదే తొలిసారి అన్నది గమనార్హం.అదనపు డైరెక్టర్ స్థాయి మహిళా అధికారి నేతృత్వంలో ఐదుగురు అధికారుల బృందం సోనియాను ప్రశ్నిస్తున్నారు.
ఒకవేళ విచారణ సమయంలో ఆమె అలసటకు గురైతే మధ్యలో విశ్రాంతి తీసుకునేందుకు అనుమతినిస్తామని ఈడీ వర్గాలు తెలిపాయి.ఇదే కేసులో ఇటీవల రాహుల్ గాంధీని కూడా ఈడీ విచారించింది.
మొత్తం 5 రోజుల్లో 10 గంటలపాటు రాహుల్ను ఈడీ అధికారులు విచారించారు.
సోనియాగాంధీని ఈడీ ప్రశ్నించడంపై కాంగ్రెస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.రాజకీయ ప్రతీకారంతోనే బీజేపీ ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను వాడుకుంటున్నదని కాంగ్రెస్ ఆరోపిస్తోంది.సోనియా ఈడీ ముందు హాజరవుతున్న సందర్భంగా ఢిల్లీలో కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు.
కొంతమంది ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.కాంగ్రెస్ సీనియర్ నాయకులు అధిర్ రంజన్ చౌధరీ, సచిన్ పైలట్, అశోక్ గెహ్లోత్ తదితరులను పోలీసులు అరెస్ట్ చేశారు.
దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ ఆందోళనలు చేపట్టింది…
.