గతకొంత కాలంగా భారత్-చైనా సరిహద్దులో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా భారత సైన్యం పెద్ద ఎత్తున బలగాలను మొహరించింది.అయితే తాజాగా అక్కడ చోటు చేసుకున్న ఘర్షణలో భారత సైన్యానికి చెందిన 20 మంది జవాన్లు తమ ప్రాణాలను కోల్పోయారు.
తెలంగాణకు చెందిన కల్నల్ సంతోష్ బాబు ఈ ఘర్షణలో వీరమరణం పొందినట్లు ఆర్మీ అధికారులు తెలిపారు.సూర్యాపేటకు చెందిన కల్నల్ సంతోష్ బాబు 15 ఏళ్లుగా భారత సైన్యంలో దేశం కోసం పనిచేస్తున్నాడు.
సూర్యాపేటకు చెందిన బి.ఉపేందర్ కొడుకైన సంతోష్ బాబు చిన్నతనం నుండే దేశభక్తి కలిగినవాడిగా అందరి మన్ననలు పొందాడు.తన తండ్రి ఆర్మీలో చేరాలని అనుకున్నా, అది కుదరకపోవడంతో ఆయన ఆశయాన్ని తాను నెరవేర్చాలని ధృడంగా నిశ్చయించుకున్నాడు.దీని కోసం ఆయన చాలా కష్టాలను ఎదుర్కొన్నాడు.6వ తరగతి నుంచి కోరుకొండ సైనిక్ స్కూల్లో చదివిన సంతోష్ బాబు అటుపై డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజీలో శిక్షణ పొందారు.2004లో సంతోష్ బాబు సైన్యంలో చేరాడు.
15 ఏళ్ల సర్వీసులో ఏకంగా నాలుగు ప్రమోషన్లు పొందిన సంతోష్ బాబు 37 ఏళ్లకే కల్నల్ హోదాను సంపాధించాడు.దేశ రక్షణలో భాగంగా దేశ సరిహద్దుల్లోనే ఎక్కువగా విధులు నిర్వహించిన సంతోష్ బాబు, రెండేళ్ల నుండి చైనా సరిహద్దులో భారత్కు పహారా కాస్తున్నారు.
సంతోష్ బాబుకు 2010లో వివాహం జరగ్గా, ఆయనకు ఓ కూతురు(అభిజ్ఞ), కుమారుడు(అనిరుథ్) ఉన్నారు.కాగా ఇటీవల ఆయన హైదరాబాద్కు బదిలీ అయ్యారు.కానీ లాక్డౌన్ కారణంగా ఆయన లడాఖ్లోనే ఉండిపోయారు.
తాజాగా అక్కడ పరిస్థితులు ఉద్రిక్తంగా మారగా, గాల్వాన్ లోయలో చైనా సైనికులు భారత జవాన్లపై దాడికి దిగారు.
ఈ దాడిలో సంతోష్ బాబు అమరుడయ్యాడు.దేశ రక్షణ కోసం తన కొడుకు ప్రాణం విడిచినందుకు గర్వంగా ఉందని సంతోష్ బాబు తల్లిదండ్రులు కన్నీటి పర్యంతంగా మారారు.
దేశం కోసం ప్రాణం విడిచిన కల్నల్ సంతోష్ బాబు త్యాగానికి దేశ ప్రజలు జోహార్ కొడుతున్నారు.