అమెరికన్ దిగ్గజ కంపెనీలకు సారథులుగా భారతీయులు వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.ఇప్పటికే సుందర్ పిచాయ్, సత్యనాదెళ్ల, అరవింద్ కృష్ణ, అజయ్ బంగా, శంతను నారాయణ్, పరాగ్ అగర్వాల్ వంటి వారు ఈ లిస్ట్లో స్థానం సంపాదించిన సంగతి తెలిసిందే.
తాజాగా మరో దిగ్గజ అమెరికన్ ఐటీ సంస్థ కాగ్నిజెంట్ సీఈవోగా భారతీయుడు నియమితులయ్యాడు.ఇన్ఫోసిస్ మాజీ ప్రెసిడెంట్ రవికుమార్ను ఈ పదవి వరించింది.
గత నాలుగేళ్లుగా సీఈవోగా సేవలందించిన బ్రియాన్ హంఫ్రీస్ స్థానంలో రవి కుమార్ను సీఈవోగా నియమిస్తున్నట్లు కాగ్నిజెంట్ ఒక ప్రకటనలో తెలిపింది.అలాగే కంపెనీలో బోర్డులోనూ ఆయనకు స్థానం కల్పించింది.
ఈ హోదాలో ఆన్ డిమాండ్ సొల్యూషన్స్, సాలిడ్ బ్రాండింగ్, అంతర్జాతీయ విస్తరణను రవికుమార్ పర్యవేక్షిస్తారు.సీఈవోగా తప్పుకున్నప్పటికీ హంఫ్రీస్ ప్రత్యేక సలహాదారుగా సేవలందిస్తారని కంపెనీ తెలిపింది.
కుమార్ దాదాపు 20 ఏళ్లపాటు ఇన్ఫోసిస్లో ప్రెసిడెంట్గా, సీవోవోగా పనిచేశారు.తాను కాగ్నిజెంట్లో చేరుతున్నట్లు అక్టోబర్ 2022లో చేరారు.ఆయన గతంలో ట్రాన్స్ యూనియన్, సాఫ్ట్వేర్ సర్వీసెస్ ప్రొవైడర్ డిజిమార్క్ బోర్డులలో కూడా పనిచేశారు.శివాజీ యూనివర్సిటీ నుంచి ఇంజనీరింగ్లో బ్యాచిలర్ డిగ్రీ, భారత్లోని జేవియర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ నుంచి ఎంబీఏ చేశారు రవి కుమార్.
ఇదిలావుండగా కాగ్నిజెంట్ సీఈవో హోదాలో రవి కుమార్ వార్షిక వేతనం ఇప్పుడు కార్పోరేట్ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది.ఈయన ఏడాదికి 7 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో రూ.57 కోట్లు) వేతనంగా అందుకుంటారు.దీనితో పాటు జాయినింగ్ బోనస్ కింద 7,50,000 డాలర్లు ( భారత కరెన్సీలో రూ.6 కోట్లు) కూడా అందుకుంటారు.అయితే.సీఈవోగా హంఫ్రీస్ పనితీరుపై ఇన్వెస్టర్లు అసంతృప్తి వ్యక్తం చేశారు.2022 మూడవ త్రైమాసికంలో ఆదాయంలో గణనీయమైన క్షీణత వుంది.అలాగే ఈ కాలంలో కాగ్నిజెంట్ షేర్లు 24 శాతం క్షీణతను నమోదు చేశాయి.కంపెనీ షేరు ధర 88 డాలర్ల నుంచి 67 డాలర్లకు పడిపోయింది.ఈ నేపథ్యంలోనే సీఈవోను మార్చాలంటూ ఇన్వెస్టర్లు కంపెనీ బోర్డుకు ఒత్తిడి తెచ్చారు.