నిన్న తెలంగాణ బడ్జెట్ సమావేశాల సందర్భంగా అధికార పార్టీ, విపక్షాలకు మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగిన సంగతి తెలిసిందే.ఈ వ్యవహారంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సస్పెండ్ కూడా అయ్యారు.
అసెంబ్లీలో తెలంగాణ మంత్రి దయాకర్ రావు, కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మధ్య తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం నడిచింది.ప్రజా సమస్యలు కాస్తా, వ్యక్తిగత స్థాయి వరకు వెళ్లిపోవడంతో అసెంబ్లీ లో మరింత వేడి రాజుకుంది.
ఈ ఇద్దరు నేతల మధ్య తలెత్తిన వివాదం ఏంటి ? దీనికి సొంత పార్టీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు కేసీఆర్ ఎందుకు క్లాస్ పీకారు అనేది ఆసక్తిగా మారింది.ఇంతకీ విషయం ఏంటంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నిన్న అసెంబ్లీలో మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి చాలా అధ్వానంగా ఉందని, గ్రామాల్లో పాఠశాలలు సక్రమంగా లేవని, అలాగే ప్రభుత్వ ఆసుపత్రులలో డాక్టర్లు లేరు అంటూ ఆయన విమర్శలు చేశారు.
దీనిపై స్పందించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సమస్యలు ఉన్నాయంటూ మీరు ఎలా చెబుతున్నారు ? జిల్లాలకు వెళ్లి చూద్దాం అంటూ రాజగోపాల్ కు సవాల్ విసిరారు.అక్కడితో ఆగకుండా, రాజగోపాల్ అసలు ప్రజల్లో తిరుగుతున్నాడా లేక రోడ్లమీద తిరుగుతున్నాడో అర్థం కావడం లేదన్నారు.
నీకు మిత్రుడిగా సలహా ఇస్తున్నాను, నువ్వు నా వెంట వస్తే నువ్వు ఏ జిల్లాకు వెళ్దాం అంటే ఆ జిల్లాకు వెళదాం, అప్పుడు జనాలు ఉరికించి ఉరికించి నిన్ను కొడతారు, ఏం మాట్లాడుతున్నావ్ అంటూ ఎర్రవల్లి రాజగోపాల్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు.దీనిపై స్పందించిన రాజగోపాల్ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అంటే మాకు ఎంతో అభిమానమని, అందుకే ఎప్పుడూ ముఖ్యమంత్రిపై నేరుగా విమర్శలు చేయలేదని, పార్టీ వేరైనా ఒక కుటుంబ సభ్యుడిగా మాకు పెద్దన్నతో కేసీఆర్ సమానమని చెప్పుకొచ్చారు.
రాజకీయాల్లోనే కాదు, నిజజీవితంలో కూడా ఆయన్ని అభిమానిస్తామని అన్నారు.ఈ ఎర్రబెల్లి దయాకర్ రావు ఇటువంటి వాళ్లు ఎక్కడ నుంచి పుట్టుకొచ్చారు అధ్యక్షా అంటూ, రాజగోపాల్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.తెలంగాణ ఉద్యమంలో వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అని ప్రశ్నించారు.అది ఆయన తప్పు కాదని, తెలంగాణ ద్రోహులను కూడా కేబినెట్లో కెసిఆర్ చేర్చుకున్నారని రాజగోపాల్ రెడ్డి విమర్శించారు.
ఈ వ్యవహారం అంతా ముగిసిన తరువాత సీఎం కేసీఆర్ ఎర్రబెల్లి దయాకర్ రావును పిలిపించుకుని గట్టిగా క్లాస్ పీకినట్టు తెలుస్తోంది.ప్రతిపక్షాలు అన్నాక విమర్శలు చేస్తారు, అని దానికి హుందాగా సమాధానం చెప్పాలి తప్ప ఈ విధంగా ఎదురు దాడి చేయడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఎర్రబెల్లి దయాకర్ రావు కేసీఆర్ కు క్షమాపణ చెప్పినట్లు తెలుస్తోంది.