తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ విజృంభిస్తోంది.కరోనా వైరస్ నియంత్రణకు తీసుకుంటున్న చర్యలపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు.
ఈ సమావేశంలో మంత్రి ఈటల రాజేందర్, వైద్యారోగ్య శాఖ అధికారులు పాల్గొన్నారు.కరోనా విషయంలో హైకోర్టు చేసిన వ్యాఖ్యలను అధికారులు సమావేశంలో ప్రస్తావించారు.
హైకోర్టుకు కావాల్సిన సమాచారాన్ని వైద్యాధికారులు అందించాలని సీఎం కేసీఆర్ సూచించారు.హైకోర్టు అడిగిన అన్ని వివరాలను తెలిపాలని కోరారు.
కరోనా బాధితులకు అందిస్తున్న వైద్యం వివరాలను, తీసుకుంటున్న జాగ్రత్తలను హైకోర్టుకు అఫిడవిట్ రూపంలో సమర్పించాలని కేసీఆర్ అధికారులను ఆదేశించారు.
కరోనా విషయంలో ఎవరు పడితే వారు హైకోర్టును ఆశ్రయిస్తున్నారని సీఎం కేసీఆర్ అన్నారు.
ఇప్పటికి హైకోర్టు 87 పిల్స్ను స్వీకరించిందని తెలిపారు.నిత్యం కోర్టు విచారణ వల్ల అధికారులకు ఇబ్బంది కలుగుతుందనే అధికారులు తెలిపారు.
వైద్యం అందించే సమయంలో అధికారులు కోర్టు చుట్టూ తిరగడానికే ఎక్కువ సమయం కేటాయించాల్సి వస్తుందని కేసీఆర్ ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు.దీంతో విధులకు పూర్తి న్యాయం చేయలేక పోతున్నామని అధికారులు వాపోయారు.
దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో కరోనా నియంత్రణ పరిస్ధితి మెరుగ్గానే ఉందని అధికారులు వివరించారు.మరణాల సంఖ్య కూడా తక్కువగా ఉందని తెలిపారు.
వైద్యశాఖ శక్తి వంచన లేకుండా పనిచేస్తోందని.ఎంత మందికైనా వైద్యం అందించేందుకు యంత్రాంగం సిద్ధంగా ఉందని చెప్పుకొచ్చారు.
ప్రతిరోజూ వేల సంఖ్యలో పరీక్షలు నిర్వహిస్తున్నప్పటికీ.హైకోర్టు చేసిన వ్యాఖ్యలు బాధ కలిగిస్తోందని వైద్య అధికారులు ఆవేదన వ్యక్తం చేశారు.