ఆరు దశాబ్దాల తెలంగాణ రాష్ట్ర సాధన కల సాకారం చేసిన చాణక్యుడు కేసీఆర్ రాజకీయ జీవితంలో మరో సాహస క్రీడకు తెరలేపారు .తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా టీఆరెఎస్ ను స్థాపించి తన లక్ష్యాన్ని సాధించి ముఖ్యమంత్రిగా ఎదిగిన ఘట్టం మొదటి దశ ఐతే … ఇపుడు తాజాగా కేంద్రంలో బలమైన బీజేపీతో ఢీ కొడుతూ ముందుకెళ్లబోయే క్రమం ఆయన రెండవ దశ రాజకీయ వ్యూహం అని భావించవచ్చు.
తాజాగా కేసీఆర్ అమలుచేస్తున్న వ్యూహల ఫలితాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.నూతన రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉద్యమ వాసనతో టీఆరెఎస్ ను అధికారంవైపు నడిపించిన కేసీఆర్ …ఆ తర్వాత ముందస్తు వ్యూహంతో ప్రత్యర్థి పార్టీల్లో ఉన్న నాయకత్వ లేమిని అనుకూలంగా మార్చుకొని పక్క స్కెచ్ తో మరోసారి కారు స్పీడ్ కు బ్రేకులు లేకుండా చేసారు .కానీ ఇటీవల కాలంలో రాష్ట్రంలో మారుతున్న పరిణామాలు, బీజేపీ బలంగా రాష్ట్రంలో విస్తరిస్తున్న నేపథ్యంతో పాటు దర్యాప్తు సంస్థల దాడుల పరిణామ క్రమంలో కేసీఆర్ వ్యూహం ఎలా ఉండబోతుందన్నది కూడా చర్చనీయాంశం మారింది .మొదటి సారి అధికారంలో ఉన్నప్పుడు బీజేపీపై బలమైన పోరాటానికి దిగని కేసీఆర్ రెండో దఫా అధికారంతో ఆ పార్టీ నుండి వస్తున్న ముప్పుతో రాజీనా ? రణమా ? అనే పరిస్ధితుల్లో పోరాటమే శరణ్యమంటూ పూరించిన బీఆర్ఎస్ శంఖారావం తీసుకొచ్చే ఫలితమేంటీ? ముంచుతున్న పరిణామాలేంటి అన్నదే మేజర్ పాయింట్.
తెలుగు నాట రాజకీయాల్లో అపార అనుభవం ఉన్న అతి తక్కువమంది నాయకుల్లో కేసీఆర్ ఒకరు .సమయాన్ని , సందర్భాన్ని బట్టి వ్యూహలు మార్చుకుంటూ ఫైనల్ గోల్ కోసం తమ మాటలతో ఎవరినైనా పడగొట్టి ఫలితం సాధించడంలో నేర్పరి .ఆ అనుభవమైన చాణక్యమే కేసీఆర్ ను ఈ రోజు ఈ స్ధాయిలా నిలిపిందనడంలో సందేహం లేదు.తెలంగాణ ఉద్యమంలో అన్ని శక్తులు కలిసిరావడంతో బలమైన దూకుడు ప్రదర్శించిన కేసీఆర్ రాజకీయ జీవితంలో మాత్రం వ్యూహత్మకమైన పంథాతో పాటు ఎక్కడో తగ్గాలో అక్కడ తగ్గుతూ టీఆరెఎస్ లాంటి ఉద్యమ పార్టీని బలమైన రాజకీయ పార్టీగా మార్చడంలో సఫలమయ్యారు .రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరూ ఊహించని రీతిలో కేంద్రంలోకి బీజేపీతో పోరాటానికి సై అనడం చాలామంది ఆశ్చర్యపరిచిందనే చెప్పవచ్చు .బీజేపీతో ముంచుకొస్తున్న ముప్పు నేపథ్యంలో పోరాటమే శరణ్యంగా భావించి ఈ దూకుడు ప్రదర్శించినట్లుగా అర్థమవుతుంది.2018 ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీలోని నాయకత్వ లేమిని తనకు కేసీఆర్ తనకు అనుకూలంగా మార్చుకోవడంలో అందునా ఈ పార్టీ నుండి గెలిచిన ఎమ్మెల్యేలను , నేతలను తమవైపు తిప్పుకోవడం కేసీఆర్ చేసిన ఓ పొరపాటుగా కొందరు సీనియర్ నేతలు విశ్లేషిస్తున్న అంశాన్ని కూడా గమనించాలి .
తెలంగాణలో రెండవ స్థానంలో ఉన్న కాంగ్రెస్ ను ఖాలీ చేసిన పరిణామాలతో మూడో స్థానంలో ఉన్న బీజేపీ చాలా బలమైన ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగింది .దుబ్బాక , హుజూరాబాద్ ఉప ఎన్నికతో బీజేపీ జెండా ఎగరవేయడం , మునుగోడు ఉపపోరులో కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి వ్యక్తిగత ఇమేజ్ తో బీజేపీ బలమైన పోటీ ఇవ్వడం టీఆరెఎస్ కు ఇబ్బందికరంగానే మారింది .గ్రేటర్ ఎన్నికల్లో కూడా బీజేపీ బలమైన శక్తిగా ఎదగడం ఇది ఒక రకంగా కాంగ్రెస్ పార్టీ నేతల వలసలను తమ పార్టీలోకి ప్రోత్సహించడం టీఆరెఎస్ కు ఇబ్బందికరంగా మారగా… బీజేపీకి వరంగా మారిందనే చెప్పవచ్చు .పక్క రాష్ట్రమైన ఏపీలో ఈ ముప్పు ముంచుకొస్తుందనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి టీడీపీ ఎమ్మెల్యేల వలసలను పెద్దగా ప్రోత్సహించలేదు.ఏ నియోజకవర్గంలో , ఏ జిల్లాలో కొంతమేరకు అవసరమో అక్కడే ఎమ్మెల్యేలను మాత్రమే చేర్చుకోవడం జరిగింది .ప్రధాన ప్రతిపక్ష పార్టీయైన టీడీపీలో కొనసాగుతున్న సుమారు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఆ టైంలో జగన్ టీంకు టచ్ లోకి వచ్చినా .ముఖ్యమంత్రి పెద్దగా ఆసక్తి చూపకపోవడం వెనుక స్థానిక పరిస్ధితులే కాకుండా కేంద్రంలోని అధికార పార్టీ ఆ నియోజకవర్గాల్లో ఏర్పడే శూన్యతను తమకు అనుకూలంగా మార్చుకుంటుందనే భావనతోనే జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారనే చర్చ జరిగింది .
కలిసివచ్చే పార్టీలు , కలిసి వచ్చే వర్గాలతో కలిసి తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ఫలితాన్ని సాధించిన కేసీఆర్ ఈ సారి ఎన్నికల్లో ఆతరహా గేమ్ ప్లాన్ రూపొందిస్తున్నట్లు తెలుస్తుంది.ఆ క్రమంలో భాగంగానే వామపక్ష పార్టీలను తమవైపు తిప్పుకుంటూ బీజేపీని ద్వేషించే శక్తులను ఏకం చేసే క్రమంలో మైనారిటీ వర్గాలకు మరింత చేరువయ్యే కార్యక్రమాలకు కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారు.మరోవైపు తెలంగాణ సమాజం బీజేపీ కుట్రలను గమనించాలని పదేపదే అధికార పార్టీ విజ్ఞప్తులు కూడా చేస్తూ ప్రచారం చేస్తుంది.ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ పైనా , ఆ పార్టీ నేతలపైనా విమర్శలకు దూరం పాటించడం కూడా వ్యూహత్మకమే.
భవిష్యత్ లోఎన్నికలముందుగానీ , వెనుకగానీ జరిగే సమీకరణాలో ఆ పార్టీ నుండి కలిగే ప్రయోజనాలను కూడా కేసీఆర్ గమనంలోకి తీసుకొనే ముందుకెళుతున్నట్లు తెలుస్తోంది.వచ్చే ఎన్నికల్లో టీఆరెఎస్ వర్సెస్ బీజేపీకి పడే గేమ్ లో కాంగ్రెస్ , ఎంఐఎం తమకు కలిసివస్తుందనే భావన కేఆసీఆర్ లో ఉండవచ్చు.
వచ్చే ఎన్నికల లోపు కేసీఆర్ టీంపై జరిగే సీబీఐ, ఈడీ ఇతర దర్యాప్తు సంస్థల దాడులు , కేసులు అధికార పార్టీ నేతలకు అగ్నిపరీక్షే.కేసీఆర్ కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన సహరా, ఈఎస్ఐ స్కామ్ లకు సంబంధించిన అంశాలతో పాటు మంత్రులపైనా, ఆపార్టీ నేతలపై వచ్చిన అవినీతి ఆరోపణలు , ఆదాయాలకు సంబంధించిన వ్యవహారాలు అన్ని మళ్లీ రాజకీయ క్రీడల్లో భాగంగా తెరపైకి వస్తున్నాయి .మరింతగా దాడులు , కేసులు జోరు పరస్పరం పెరిగే అవకాశాలున్నాయి .వీటన్నిటి ఏ విధంగా కేసీఆర్ ఫేస్ చేస్తారన్నది ఆసక్తిని రేపుతుంది.ఇప్పటికే టీఆర్ఎస్ , బీజేపీలో తమతమ ప్రభుత్వాల ఆధీనంలో ఉన్న దర్యాప్తు సంస్థలతో ఆడుతున్న విన్యాసాలతో రాజకీయాలు రసనత్తరంగా మారాయి .అన్ని తెలిసే మళ్లీ అధికారమే లక్ష్యమనే భావనతో కేంద్రంపై పోరుబాట ఎగరవేసిన కేసీఆర్ మార్చిన గేమ్ ప్లాన్ మూడో దఫా తెలంగాణలో కారుపార్టీకి కిరీటాన్ని తెచ్చిపెడుతుందా లేక ఆపార్టీ రూట్ ను మరోవైపు మారుస్తుందా అన్నదానికి రాబోయే ఎన్నికలో సమాధానం చెప్పనున్నాయి .