తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ తో పాటు రాష్ట్రవ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలు, వరదల బీభత్సం పై ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యవసర ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.ఆయా శాఖల అధికారులు, ఆయా శాఖల పరిధిలో జరిగిన నష్టాన్ని సీఎం కు వివరించారు.
రాష్ట్రంలో వరద బాధితులకు వెంటనే యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు.
వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రభుత్వం తరఫున ప్రతి ఇంటికి ఆహార పదార్థాలు, ఒక్కో ఇంటికి 3 దుప్పట్లు వెంటనే అందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
హైదరాబాద్ పరిధిలో సహాయ కార్యక్రమాల కోసం రూ 5 కోట్ల నిధులను తక్షణమే విడుదల చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు.
వరదల బీభత్సం కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 50 మంది మృతి చెందారని, మృతుల్లో హైదరాబాద్ పరిధిలోనేి 11 మంది ఉన్నట్లు అధికారులు ముఖ్యమంత్రికి తెలియజేశారు.మృతిచెందిన వారి కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించాలని, ఇల్లు పూర్తిగా కూలిపోయిన వారికి వెంటనే కొత్త ఇల్లు మంజూరు చేయాలని అధికారులను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు.పాక్షికంగా దెబ్బతిన్న ఇళ్ల మరమ్మతులకు ఆర్థిక సహాయం అందించాలని అన్నారు.
ఇక రాష్ట్రవ్యాప్తంగా 7.35 లక్షల ఎకరాల్లో పంటకు నష్టం వాటిల్లినట్లు, వీటి నష్టం విలువ సుమారు 2 వేల కోట్లు ఉంటుందని అంచనా వేసినట్లు అధికారులు సీఎంకు వివరించారు.హైదరాబాద్ నగరంలో భారీ వర్షాల కారణంగా మొత్తం 72 ప్రాంతాల్లోని 144 కాలనీల్లో సుమారు 20 వేల కు పైగా ఇల్లు వరద నీటిలో చిక్కుకున్నాయని, ఇందులో 35 వేల కుటుంబాలు వరద ప్రభావానికి గురి అయినట్లు అధికారులు ముఖ్యమంత్రికి తెలియజేశారు.
వరద ప్రభావిత ప్రాంతాల ప్రజల కోసం 72 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వివరించారు.వర్షాలు మరో రెండు రోజుల పాటు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులను సీఎం హెచ్చరించారు.