ఎప్పుడూ ఏదో ఒక వినూత్న కార్యక్రమంతో జనాల్లో వైసిపి పేరు మారుమోగే విధంగా చేయాలనే తాపత్రయంతో ఉంటారు ఆ పార్టీ అధినేత ఏపీ సీఎం జగన్.సార్వత్రిక ఎన్నికలు సమయం దగ్గర పడుతుండడంతో, ప్రజల్లో వ్యతిరేకత రాకుండా చూసుకునేందుకు ఎప్పటికప్పుడు సరికొత్త కార్యక్రమాలు రూపొందిస్తూ.
పార్టీ నాయకులను అలెర్ట్ చేస్తూ వస్తున్నారు జగన్.సీఎంగా బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి జగన్ ఎక్కువగా క్యాంపు కార్యాలయానికే పరిమితం అవుతున్నారు.
ప్రజల్లోకి అప్పుడప్పుడు మాత్రమే వస్తున్నారు.ఇక ఈ నెల నుంచి ఏపీ వ్యాప్తంగా పల్లెనిద్ర కార్యక్రమాన్ని ప్రారంభించాలని చూస్తున్న జగన్ మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టుబోతున్నారు.
ఏపీలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించే విధంగా , ప్రజల ఫిర్యాదులను పారదర్శకంగా పరిశీలించి పరిష్కరించే విధంగా ‘జగనన్నకు చెబుదాం ‘ అని కార్యక్రమాన్ని ప్రారంభించే ఆలోచనతో జగన్ ఉన్నారు.
ఇప్పటికే దీనికి సంబంధించి కొన్ని శాఖల అధికారులతో జగన్ చర్చించినట్లు సమాచారం.ప్రజలు ఏదైనా సమస్యను చెప్పుకుంటే , వెంటనే దానిని పరిష్కరించే విధంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు.ఇప్పటికే జగనన్నకు చెబుదాం కార్యక్రమం ప్రారంభానికి సర్వం సిద్ధం చేయాలని అధికారులను జగన్ ఆదేశించారట.
ప్రతి ప్రభుత్వ విభాగాధిపతి , ప్రతి వినతిని పరిష్కారం చేసేంతవరకు ట్రాక్ చేయాలని ప్రభుత్వానికి అందిన ఫిర్యాదులను ప్రతివారం ట్రాక్ చేయాలని, అలాగే ఎప్పటికప్పుడు నివేదికలను తీసుకోవాలని అధికారులకు సూచించారు.ప్రస్తుతం అమలు చేస్తున్న స్పందన కార్యక్రమం మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు ఫిర్యాదులను ట్రాకింగ్ చేసి పరిష్కారం అయ్యేవరకు దాని స్థితిని ప్రజలు తెలుసుకునే విధంగా ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రారంభించాలని జగన్ భావిస్తున్నారట.
ఇప్పటికే సీఎం ఓ తో పాటు, ప్రతి ప్రభుత్వ శాఖలో కూడా జగనన్నకు చెబుదాం ప్రాజెక్ట్ మానిటరింగ్ విభాగాలు ఏర్పాటు చేయాలని, జిల్లా స్థాయిలోను , మండల స్థాయిలోను కూడా ప్రాజెక్టు మానిటరింగ్ యూనిట్స్ ఏర్పాటు చేసుకోవాలని ప్రభుత్వం నుంచి అధికారుల కు ఆదేశాలు వెళ్ళాయట.