ఏపీలో కుప్పం నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత ఉంది.టిడిపి అధినేత చంద్రబాబు చాలా కాలంగా కుప్పం నియోజకవర్గ నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఉండడం, టిడిపికి అది కంచుకోట కావడంతో ఆ నియోజకవర్గానికి అంత పేరు ఉంది.
చిత్తూరు జిల్లాలో ఉన్న ఈ కుప్పం నియోజకవర్గాన్ని ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం టార్గెట్ చేసుకుంది.రాబోయే ఎన్నికల్లో చంద్రబాబును ఓడించడమే లక్ష్యంగా 2019 ఎన్నికల తరువాత నుంచి వైసిపి టార్గెట్ పెట్టుకుంది.
ఈ మేరకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి టిడిపి నాయకులను వైసీపీలో చేర్చే బాధ్యతలను తీసుకున్నారు.ఆ దిశగా సక్సెస్ అవుతూనే వస్తున్నారు. 2024 ఎన్నికల్లో చంద్రబాబును ఓడించడమే లక్ష్యంగా జగన్ ప్రత్యేక ఫోకస్ పెట్టారు.
ఇదిలా ఉంటే ఏపీ వ్యాప్తంగా వైసిపి కార్యకర్తల్లో చాలా విషయాల్లో అసంతృప్తి పెరిగిపోయినట్లుగా జగన్ గుర్తించారు.
ముఖ్యంగా ఎమ్మెల్యేలు, పార్టీ కీలక నాయకులు కార్యకర్తలను పట్టించుకోవడం లేదనే ఫిర్యాదులు వస్తున్న క్రమంలో జగన్ నేరుగా ప్రతి నియోజకవర్గంకు చెందిన ముఖ్యమైన 50 మంది కార్యకర్తలను కలవాలని నిర్ణయించారు.ఈ మేరకు ఆగస్టు నాలుగో తేదీ నుంచి అంటే ఈరోజు నుంచి ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
ప్రతి నియోజకవర్గం నుంచి 50 మంది ముఖ్య కార్యకర్తలతో జగన్ ప్రత్యేకంగా సమావేశాన్ని నిర్వహించి, ఆయా నియోజకవర్గాల్లో వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, పార్టీ పరిస్థితి , తదితర అన్ని విషయాలను నేరుగా కార్యకర్తలను అడిగి తెలుసుకోవడంతో పాటు, జగన్ సైతం పార్టీని ఏ విధంగా బలోపేతం చేయాలి ? ఇప్పటి వరకు ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాల విషయాలను ప్రజలకు అర్థమయ్యేలా ఎలా చెప్పాలి ? తమ రాజకీయ ప్రత్యర్థులు చేస్తున్న విమర్శలకు ఏ విధంగా చెక్ పెట్టాలి ? ఇలా అనేక అంశాలపై కార్యకర్తలకు జగన్ దిశా నిర్దేశం చేయబోతున్నారు.
అటువంటి కార్యక్రమాన్ని ఇప్పుడు కుప్పం నియోజకవర్గం నుంచి శ్రీకారం చుట్టారు.ఇదేవిధంగా ప్రతి జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలోనూ కార్యకర్తలతో జగన్ భేటీ కాబోతుండడంతో, కార్యకర్తలలోనూ ఉత్సాహం కనిపిస్తుంది.ఇప్పటి వరకు తమ సూచనలను వింటూ తమకు సూచనలు ఇచ్చే వారు కరువయ్యారని , నేరుగా పార్టీ అధినేత కే తమ సమస్యలను చెప్పుకునే అవకాశం వచ్చిందని, పార్టీని మరింత బలోపేతం చేసే విధంగా సూచనలు జగన్ నుంచి నేరుగా వినే అవకాశం రావడంతో కార్యకర్తలలోను ఆనందం కనిపిస్తోంది.
అదే విధంగా ప్రతి నియోజకవర్గంలోనూ కార్యకర్తలతో సమావేశమై వారి నుంచి వస్తున్న ఫీడ్ బ్యాక్ ఆధారంగా పార్టీలోను, ప్రభుత్వంలోనూ అనేక ప్రక్షాళన కార్యక్రమాలు చేపట్టేందుకు జగన్ సిద్ధమవుతున్నారు
.