ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన రోజు నుంచి విద్య, వైద్యంకు అధికంగా ప్రాధాన్యత ఇస్తున్న సంగతి తెలిసిందే.గతంలో వైద్యం ఖర్చు వెయ్యి రూపాయలు దాటితే ఆరోగ్యశ్రీ అమలు చేస్తానని చెప్పిన జగన్ తాజాగా ఆ మాటను నిలబెట్టుకున్నారు.
గతంలో ఆరోగ్యశ్రీ పథకం ద్వారా 1059 వ్యాధులకు చికిత్స అందించగా ప్రస్తుతం ఈ పథకం ద్వారా 2200 వ్యాధులకు ప్రభుత్వం చికిత్స అందిస్తోంది.
సీఎం జగన్ నేడు రాష్ట్రంలోని ఆరు జిల్లాల్లో ఆరోగ్యశ్రీ సేవలను ప్రారంభించారు.
ఏపీ ప్రభుత్వం తాజాగా కడప, కర్నూలు, ప్రకాశం, గుంటూరు, విశాఖ, విజయనగరం జిల్లాల్లో ఆరోగ్యశ్రీ పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చింది.పథకం అమలు సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఐదు లక్షల రూపాయల లోపు ఆదాయం ఉన్నవారందరికీ ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేస్తామని చెప్పారు.
రాష్ట్రంలోని కోటీ 42 లక్షల మందికి ఆరోగ్యశ్రీ కార్డులు ఇచ్చామని… ప్రభుత్వ ఆస్పత్రుల రూపురేఖలను నాడు నేడు పథకం అమలు ద్వారా మార్చబోతున్నామని కీలక ప్రకటన చేశారు.రాబోయే రోజుల్లో రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో సైతం ఆరోగ్యశ్రీ అదనపు సేవలు అందుబాటులోకి వస్తాయని… ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన మందులను మాత్రమే పంపిణీ చేస్తున్నామని తెలిపారు.
రాష్ట్రంలోని ప్రజలు వైద్యం కోసం ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో ఇప్పటికే ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందని… ఆరోగ్యపరంగా పూర్తిగా మార్పులు చేస్తున్నామని సీఎం చెప్పారు.16వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి కొత్తగా 16 టీచింగ్ ఆస్పత్రులను కట్టబోతున్నామని….13వేల విలేజ్ క్లినిక్ లను అందుబాటులోకి తీసుకొచ్చామని అన్నారు.