ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు హాట్ హాట్ గా కొనసాగుతున్నాయి.మూడు రాజధానుల విషయం పై అటు టీడీపీ,ఇటు అధికార పార్టీ తమ తమ వాదనలు వినిపిస్తున్నాయి.
ఏపీ కి మూడు రాజధానులు అవసరం లేదని ఒకపక్క టీడీపీ వాదిస్తుండగా,వైసీపీ మాత్రం మూడు రాజధానులు ఉండాల్సిందే అంటూ పట్టుబడుతోంది.ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొనడం తో టీడీపీ సభ్యుల పై సీఎం జగన్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
సభను నడవకుండా టీడీపీ సభ్యులు అడ్డుకోవడాన్ని ఆయన తీవ్రంగా తప్పు పట్టారు.సభలో మేము 151 మంది ఉన్నా ఎంతో ఓపికగా ఉన్నామని, కనీసం పట్టుమని 10 మంది సభ్యులు కూడా లేరుకానీ మీరు చెత్త రాజకీయాలు చేస్తున్నారంటూ జగన్ తీవ్ర స్థాయిలో టీడీపీ నేతలపై విరుచుకుపడ్డారు.
స్పీకర్ను టీడీపీ సభ్యులు అగౌరవపరుస్తున్నారన్నారని టీడీపీ సభ్యులు రౌడీల్లాగా వ్యవహరిస్తున్నారని, ఇంతకంటే దిక్కుమాలిన పార్టీ, దిక్కుమాలిన సభ్యులు ఎక్కడ ఉండరంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు చేసారు.మీరు అసలు ఎమ్మెల్యేలా లేదంటే వీధి రౌడీలా అంటూ జగన్ ప్రశ్నించారు.
రౌడీలను బయటకు ఈడ్చేయాలి అంటూ జగన్ మండిపడ్డారు.అసెంబ్లీలో ఎలా వ్యవహరించాలో చేతకాకపోతే అసెంబ్లీకి రావొద్దు, ఎవరైనా పోడియం వద్దకు వస్తే… మార్షల్స్తోబయటకు ఈడ్చేస్తామన్నారు.
పోడియం వద్ద మార్షల్స్ను పిలిపించి ఉంచాలన్నారు.ఎవరైనా రింగ్ దాటి లోపలికి వస్తే.
వెంటనే బయటకు పంపించేయండని స్పీకర్కు తెలిపారు సీఎం జగన్.
దీంతో స్పీకర్ వెంటనే మార్షల్స్ను సభలోకి పిలిపించినట్లు తెలుస్తుంది.మూడు రోజుల పాటు జరగనున్న ఈ ప్రత్యేక సమావేశాలు ఈ రోజు తో ముగియనున్నట్లు తెలుస్తుంది.గత రెండు రోజుల నుంచి కూడా టీడీపీ సభ్యులు జై అమరావతి నినాదాలతో హోరెత్తిస్తున్నారు.
టీడీపీ సభ్యుల తీరుపై అసహనం వ్యక్తం చేసిన స్పీకర్ తమ్మినేని మంగళవారం సభ మధ్య లో బయటకు కూడా వెళ్లిపోయారు.