తితిలీ తుఫాన్ ఎఫెక్ట్ తో అతలాకుతలం అయిన శ్రీకాకుళం జిల్లాను ఆదుకోవడానికి ఏపీ సీఎం చంద్రబాబు తీవ్రంగా కృషి చేస్తున్నారు.గతంలో ఎన్నడూ లేనంతగా శ్రీకాకుళం జిల్లా అతలాకుతలం అవ్వడంతో వారిని ఆదుకోవాలంటూ బహిరంగ లేఖను చంద్రబాబు నాయుడు రాసారు.
ఎప్పుడూ కానీ విని ఎరగని స్థాయిలో శ్రీకాకుళం జిల్లా అల్లకల్లోలమైందని లేఖలో పేర్కొన్నారు.ఉద్యానవనంలాంటి ఉద్దానం దెబ్బతిన్నాయని, నష్టంతో దశాబ్దాలు వెనక్కి పోయిందని చెప్పారు.రూ.3428కోట్ల వరకు నష్టం వాటిల్లిందని అంచనా వేశామన్నారు.సాయం చేయాల్సిన కేంద్రం నిర్లక్ష్యం వహిస్తోందని, రెండుసార్లు లేఖలు పంపినా స్పందన కరువైందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.
ఇప్పటికే రూ.1000కోట్లను శ్రీకాకుళంలో ఏపీ ప్రభుత్వం ఖర్చు చేసిందని, ప్రభుత్వ యంత్రాంగం, మంత్రులు, ఐఏఎస్లు సహాయ చర్యల్లో నిమగ్నమయ్యారన్నారు.సాధారణ పరిస్థితులు నెలకొనేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు.
ఉక్కు సంకల్పంతో, మనోనిబ్బరంతో హుద్హుద్ను జయించామన్నారు.తుపాను విధ్వంసం నుంచి శ్రీకాకుళం జిల్లా తేరుకునేందుకు తూర్పు అనే కార్యక్రమాన్ని ప్రారంభించామని చంద్రబాబు తెలిపారు.
ఇందులో భాగంగా అనేక కార్యక్రమాలు చేపడతామని, తుపాను బాధిత ప్రాంతాలన్నీ పునర్నిర్మించాలని చెప్పారు.స్వచ్ఛంద సంస్థలు, ఆర్థిక స్థోమత కలిగిన కంపెనీలు, ప్రవాసాంధ్రులు, ప్రజలు ఆర్థిక చేయూత ఇవ్వాలని చంద్రబాబు లేఖ ద్వారా పిలుపునిచ్చారు.