సీఎం చంద్రబాబు తనయుడు లోకేష్కు మంత్రి పదవి ఇంకా కట్టబెట్టకపోవడానికి కారణం ఏమిటి? ఈ ప్రశ్న చాలా మందిలో వ్యక్తమవుతోంది.అయితే మంత్రి పదవి చేపట్టేందుకు ఆయన ఇంకా సంసిద్ధంగా లేరని కొందరు చెబుతుంటే.
పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంపైనే లోకేష్ దృష్టిసారించారని అందుకే మంత్రి పదవి చేపట్టడం లేదని మరికొందరు చెబుతున్నారు.లోకేష్ను మంత్రిని చేస్తే తాము తమ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేస్తామని కూడా కొందరు టీడీపీ నేతలు ముందుకు వచ్చారు.
ఇక మంత్రి వర్గ విస్తరణ జరగడమే ఆలస్యం…లోకేష్ మంత్రి కావడం ఖాయం అంటూ అందరూ అనుకున్నారు.
కానీ అసలు కారణం ఉత్తరప్రదేశ్ సీఎం అఖిలేశ్ యాదవ్ అని ఎవరికీ తెలిసిఉండదు.
అదేంటి లోకేష్ మంత్రి పదవికి అఖిలేశ్కు అడ్డుకావడమేంటి అనేగా మీ సందేహం! వైసీపీ ఎమ్మెల్యే రోజా.యూపీ రాజకీయాలతో ఏపీ రాజకీయాలను పోల్చుతూ సరికొత్త లాజిక్ను తెరపైకి తీసుకొచ్చారు.
రాజకీయాల్లో పరిస్థితులు ఎప్పుడు ఎలా మారిపోతాయో ఎవరూ ఊహించలేరు.ఇందుకు ఉత్తరప్రదేశ్లోని సమాజ్వాద్ పార్టీలో జరుగుతున్న మార్పులే నిదర్శనం.
ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల్లోని కుటుంబ రాజకీయాలకు సరికొత్త అర్థం చెబుతున్నాయి అక్కడ జరుగుతున్న పరిణామాలు! తండ్రి నుంచి పార్టీ అంతా తన చేతుల్లోకి తీసుకోవాలని కొడుకు!! ఆ వ్యూహాలకు ఎలాగైనా చెక్ చెప్పాలని తండ్రి!! అయితే ఈ పరిణామాలు ఏపీ సీఎం చంద్రబాబుకు నిద్రలేకుండా చేస్తున్నాయని, అందుకే తనయుడు లోకేష్ కు మంత్రి పదవి ఇవ్వడం లేదని వైసీపీ ఎమ్మెల్యే రోజా విమర్శించారు.
ఉత్తరప్రదేశ్ రాజకీయాలు చూస్తుంటే సీఎం చంద్రబాబుకు బీపీ పెరుగుతోందని రోజా ఎద్దేవా చేశారు.
లోకేష్కు మంత్రి పదవి ఇస్తే.అఖిలేష్ మాదిరిగా పార్టీని తన చెప్పు చేతల్లోకి తెచ్చుకుని తనకు అధికారం దూరం చేయవచ్చనే భయంతోనే లోకేష్కు మంత్రి పదవి ఇవ్వడం లేదని విమర్శించారు.
అఖిలేష్లా లోకేష్ తనకు ఎదురుతిరగవచ్చనే దిగులు చంద్రబాబుకు పట్టుకుందన్నారు.అందుకే మంత్రి పదవి ఇవ్వడానికి వెనుకాడుతున్నారని రోజా ఆరోపించారు.