ఇటీవల తెలంగాణా లో టీఆర్ఎస్ శాసన సభా పక్షంలో కాంగ్రెస్ శాసన సభా పక్షాన్ని విలీనం చేసిన సంగతి తెలిసిందే.ఆ రాష్ట్రంలో ఉన్న 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లో చేరడం తో కాంగ్రెస్ శాసన సభా పక్షాన్ని విలీనం చేసుకున్నారు.
దీనితో కొందరు కాంగ్రెస్ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ హైకోర్టు ను ఆశ్రయించారు.ఈ నెల 6న అసెంబ్లీ సెక్రెటరీ జారీచేసిన బులెటిన్-10ని సస్పెండ్ చేయాలని కోరుతూ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి నిన్న హైకోర్టుకు వెళ్లారు.
ఆ 12 మంది ఎమ్మెల్యేలూ కాంగ్రెస్ సభ్యులు అనీ… కాంగ్రెస్ టికెట్పై గెలిచారని, అలాంటిది ఇతర పార్టీలలో ఎలా పదవులలో కొనసాగుతారు అంటూ వారు ప్రశ్నిస్తున్నారు.అలానే ఒక రాజకీయ పార్టీని మరో పార్టీలో విలీనం చేసే అధికారం స్పీకర్కు లేదని ఎన్నికల కమిషన్కు మాత్రమే అలాంటి అధికారం ఉంటుందని, ఈ విధంగా పార్టీ నుంచి ఫిరాయించిన నేతలపై అనర్హత వేటు వేయాలి అంటూ హైకోర్టు ను ఆశ్రయించారు.దీనిపై ఈ రోజు హైకోర్టు విచారణ చేపట్టనుంది.