తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని స్థాయిలో కాంగ్రెస్ పార్టీ దెబ్బతినడంతో పాటు పార్టీ సీనియర్ నాయకులందరూ ఓటమి చెందడంతో తెలంగాణ కాంగ్రెస్ నేతలందరూ తీవ్ర నిరాశలో ఉన్నారు.అలాగే గెలిచిన కొంతమంది ఎమ్యెల్యేలు కూడా ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ వైపు చూస్తుండడంతో ఆ పార్టీ నేతలు కలవరపడుతున్నారు.
మరోపక్క లోక్ సభ ఎన్నికలూ కూడా సమీపిస్తుండటంతో పార్టీలో మరింత జోష్ పెంచేందుకు కాంగ్రెస్ అధిష్టానం కూడా కసరత్తు చేస్తోంది.అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన చేదు అనుభవాలను పక్కనపెట్టి పూర్తిస్థాయిలో లోక్ సభ ఎన్నికలపై దృష్టిపెట్టాల్సిందిగా పార్టీ నేతలకు అధిష్టానం నుంచి సూచనలు అందుతున్నాయి.
ఇక తెలంగాణ నేతల్లో మరింత వేడి పెంచేందుకు పార్టీకి చెందిన ప్రముఖ నేతలు, అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులను ఢిల్లీకి పిలిచినట్టుగా సమాచారం.
ఆ సమావేశంలో ముఖ్యంగా… తెలంగాణ ఎన్నికల్లో ఓటమి కారణాలతో పాటు లోక్ సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చలు జరిగే అవకాశం ఉందని సమాచారం.సీఎల్పీ నాయకుడి ఎంపిక కూడా ఢిల్లీలోనే జరిగే అవకాశం ఉన్నట్టు కొంతమంది నాయకులూ చర్చించుకుంటున్నారు.అదీ కాకుండా… అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి సంబంధించిన కారణాలపై పీసీసీ ఒక నివేదిక సిద్ధం చేసేపనిలో కూడా నిమగ్నం అయ్యిందట.
దీంట్లో ఓటమికి ప్రధాన కారణాలుగా పొత్తులను చేర్చినట్టు సమాచారం! దీంతోపాటు అభ్యర్థుల ఎంపికలో కూడా కొన్ని పొరపాట్లు జరిగాయనీ, ఎన్నికల నిర్వహణలో కూడా లోపాలున్నాయనీ, ఈవీఎమ్ ల పనితీరుపై కూడా కొన్ని అనుమానాలున్నట్టుగా ఆ రిపోర్టులో పొందుపరిచినట్టు తెలుస్తోంది.
తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నా సమయంలో ….ఇంత దారుణమైన ఫలితాలు ఎందుకు వచ్చాయి…? అనే విషయంపై కాంగ్రెస్ హై కమాండ్ నాయకుల నుంచి అభిప్రాయాలను సేకరిస్తోంది.అలాగే… పీసీసీ నుంచి వచ్చిన ఓటమి కారణాల నివేదిక, కేంద్రం తెప్పించుకున్న సమాచారం.ఇవన్నీ దగ్గరపెట్టుకుని జరిగిన పొరపాట్లపై స్పష్టమైన నిర్ణయాలు తీసుకునేందుకు కాంగ్రెస్ హైకమాండ్ సిద్ధం అవుతోంది.అలాగే… పార్టీ పదవుల విషయంలోనూ… మార్పు చేర్పులు జరగాలని కాంగ్రెస్ భావిస్తోంది.కాకపోతే… ముందుగా లోక్ సభ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి.ఆ దిశగా తెలంగాణలోని పార్టీ శ్రేణులను సమాయత్తం చేసే ప్రక్రియపై హైకమాండ్ దృష్టి పెడుతుందనీ, ఇప్పట్లో మార్పులూ చేర్పులకు పాల్పడకుండా… దూరంగా ఉంటుందని కాంగ్రెస్ నేతలు కొంతమంది అభిప్రాయపడుతున్నారు.