ఇటీవల శ్రీలంక లో ఈస్టర్ సండే రోజున వరుస పేలుళ్ల ఘటన తో 250 మందికి పైగా మృత్యువాత పడగా, 400 ల మందికి పైగా గాయపడిన సంగతి తెలిసిందే.అయితే ఇప్పుడిప్పుడే ఆ హింస నుంచి బయటపడుతున్న శ్రీలంక లో ఇప్పుడు ముస్లిం వ్యతిరేక అల్లర్లు చోటుచేసుకున్నాయి.
ముస్లిం లకు చెందిన దుకాణాలను లక్ష్యంగా చేసుకొని హింస చెలరేగడం తో అక్కడి ప్రభుత్వం సోమవారం రాత్రి నుంచి కర్ఫ్యూ విధించింది.అయితే ఈ ఘటనల్లో భారీ ప్రాణ నష్టం జరగలేదు కానీ ఒక వ్యక్తి మాత్రం ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం.
ఈ ఘర్షణల నేపథ్యంలో అప్రమత్తమైన అధికారులు పరిస్థితిని అదుపులోకి తీసుకురావడం కోసం భాష్ప వాయువు ప్రయోగించి,గాల్లోకి కాల్పులు జరిపినట్లు తెలుస్తుంది.ఈస్టర్ సండే రోజున ఇస్లామిక్ మిలిటెంట్లు వరుస బాంబు దాడులకు పాల్పడిన అప్పటి నుంచి దేశంలో ఉద్రిక్తతలు పెరిగాయి.
ఈ ఘర్షణల నేపథ్యంలో శ్రీలంక వాయువ్య పట్టణం కినియమాలో ఓ మసీదుపై కొంతమంది దాడి చేశారు.మసీదు కిటికీ అద్దాలు పగులగొట్టారు.
ఖురాన్ ప్రతులను కిందపడేశారు.సమీపంలోని ఓ కొలనులో ఆయుధాల కోసం సైనికులు గాలించారని, అనంతరం మసీదు భవనంలోనూ గాలింపు జరపాలని డిమాండ్ చేస్తూ కొందరు ఆందోళన చేపట్టడం తో ఈ దాడికి దారితీసిందని రాయిటర్స్ వార్తాసంస్థ పేర్కొంది.
పేస్ బుక్ లో ఒక పోస్ట్ కారణంగా క్యాథలిక్ క్రైస్తవులు ఎక్కువగా ఉండే చిలా పట్టణంలో మసీదులు,ముస్లిం ల దుకాణాల పై దాడులు జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఆ ఫేస్ బుక్ పోస్ట్ పెట్టిన 38 ఏళ్ల ముస్లిం వ్యాపారిని కూడా పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తుంది.
ఈ తాజా ఘర్షణల నేపథ్యంలో మరోసారి శ్రీలంక ప్రభుత్వం సోషల్ మీడియా వాడకం పై నిషేధం విధించినట్లు తెలుస్తుంది.శ్రీలంక దేశవ్యాప్తంగా సోమవారం రాత్రి 9 గంటల నుంచి మంగళవారం ఉదయం 4 గంటల వరకూ కర్ఫ్యూ విధించింది.
నిబంధనలను అతిక్రమించే వారిని కన్పించినచోటే కాల్చిచంపాలని ఆర్మీకి ఆదేశాలు జారీచేసింది.ఈ నేపథ్యంలో ప్రజలంతా శాంతియుతంగా ఉండాలనీ, తప్పు డు వార్తలను, వదంతులను నమ్మవద్దని ప్రధాని విక్రమసింఘే విజ్ఞప్తి చేశారు.
అలానే ప్రస్తుతం అక్కడ పరిస్థితుల పై మరిన్ని వివరాలు తెలియాల్సిఉంది.