సాధారణ ప్రజలకు వినోదాన్ని పంచేది సినిమాలు మాత్రమే.సినిమాలు థియేటర్లలో, టీవీల్లో చూడాలన్నా షూటింగులు జరగాల్సిందే.
అద్భుతమైన సినిమాల వెనుక 24 రంగాల కార్మికుల స్వేదం ఉంటుంది.హీరోలు, డైరెక్టర్లు కోట్లు తీసుకుంటున్నా…కార్మికులకు గిట్టేది అంతంతమాత్రమే.
కరోనాతో తల్లకిందులైన జీవితాలను నిలబెట్టుకోవాలంటే తమ జీతాలు పెంచాల్సిందే అంటున్నారు సినీ కార్మికులు.సమస్యల పరిష్కారం కోసం షూటింగులు ఆపేసి సమ్మె చేస్తున్నారు.
సినీ రంగానికి చెందిన 24 రంగాలకు చెందిన వేలాది కార్మికులు సమ్మె ప్రారంభించారు.సినిమాల్లో మనకు కనిపించేది నటులే అయినా.వెండి తెర వెనుక ఎన్నో వందల మంది కార్మికులు ప్రతి సినిమాకు పనిచేస్తారు.పెద్ద సినిమాలైతే వేలాది మంది పని చేయాల్సి ఉంటుంది.
లైట్ బాయ్ నుంచి కెమెరాలను పరుగులు తీయించేవరకు 24 రంగాల కార్మికులు పనిచేస్తేనే మనం చూసే సినిమా రెడీ అవుతుంది.వీరికి నాలుగేళ్ళుగా జీతాలు పెంచలేదంటున్నారు.
కరోనా కాలంలో రెండేళ్ళ పాటు షూటింగులే జరగలేదు.కొన్నాళ్ళుగానే సినీ రంగం కోలుకుంది.
అదే సమయంలో ధరలు విపరీతంగా పెరిగిపోయాయి.రెండేళ్ళ పాటు షూటింగులు లేక అప్పులపాలయ్యామని, ఇప్పుడు ధరలు పెరిగి కనీస అవసరాలు తీర్చుకోలేని పరిస్థితులు ఏర్పడ్డాయని కార్మికులు చెబుతున్నారు.
నిర్మాతల మండలికి చెప్పినా పట్టించుకోనందునే సమ్మె చేయాల్సి వచ్చిందని, తమ సమస్యలు పరిష్కారమయ్యేవరకు పనులు చేసేది లేదంటున్నారు. సమ్మె చేస్తున్న కార్మికులు హైదరాబాద్ జూబిలీహిల్స్ లో ఉన్న ఫిలిం ఫెడరేషన్ కార్యాలయం దగ్గర ధర్నా నిర్వహించారు.ఇదిలా ఉంటే సినీ కార్మికుల జీతాలు పెంచడానికి తమకు ఇబ్బందేమీ లేదన్నారు నిర్మాత సి.కళ్యాణ్.ఈ నెల ఆరో తేదీన కార్మికుల సంఘాలు నిర్మాతల మండలికి లేఖ అందించారని, ఉన్నఫళంగా సమ్మె చేయడం కరెక్ట్ కాదన్నారాయన.షూటింగులు ఆపడానికి నిర్మాతలం సిద్ధంగా లేమని, చర్చలు జరిపాకే వేతనాలు పెంచుతామంటున్నారు నిర్మాత కళ్యాణ్.
కార్మికుల సమ్మెతో తెలుగు సినిమాల షూటింగులన్నీ నిలిచిపోయాయి.హైదరాబాద్ పరిసరాల్లోనే దాదాపు 20 సినిమాల షూటింగులు జరుగుతున్నాయి.
అవన్నీ ఆగిపోయాయి.ఏపీ, తెలంగాణతో సహా ఇతర రాష్ట్రాల్లో జరుగుతున్న తెలుగు సినిమాల షూటింగులు కూడా సమ్మెతో నిలిచిపోయాయి.