తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడు ఎన్నికలు జరిగినా సినీ తారలు ప్రచారానికి వాలిపోతుంటారు.ఆయా పార్టీలు , అభ్యర్థుల తరుపున వకాంతా పుచ్చుకుంటారు.
భారీ భారీ సినీ డైలాగులు చెప్తూ అభిమానులను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తుంటారు.అంతిమంగా తాము ప్రచారం చేసిన అభ్యర్థి గెలిచేలా శతవిధాలా ప్రయత్నిస్తుంటారు.
రాజకీయ పార్టీలు కూడా తమ పార్టీకి అనుకూలంగా ఉండే సినీ యాక్టర్లను ప్రచారానికి దించి లాభపడాలని చూస్తుంటాయి.తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత వారికి ఏదో ఒక నామినేటెడ్ పోస్ట్ ఇచ్చి గౌరవించుకుంటాయి.
ఇదంతా షరా మామూలుగా ప్రతి ఎన్నికల్లోనూ జరిగే తంతే.ఈ మధ్య తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సినీ గ్లామర్ పెద్దగా పనిచేయలేనట్టుగానే కనిపించింది.
అక్కడే కాదు తాజాగా ఏపీలో జరిగిన ఎన్నికల్లోనూ ఆ ప్రభావం పెద్దగా లేనట్టుగా పరిస్థితులు కనిపిస్తున్నాయి.
ఏపీ ఎన్నికల్లో కొంతమంది సినీ హీరోలు, సినీ తాజా మాజీ హీరోయిన్ లు పోటీ చేశారు.
వారి తరఫున ప్రచారం చేసేందుకు సినీ పరిశ్రమకు చెందిన వారు ఎవరూ రాలేదు కానీ వారికి వారే ప్రచారం గట్టిగానే చేసుకున్నారు.కొంతమంది వెండితెర, బుల్లితెర కమెడియన్స్ ప్రచారం చేశారు.
ఏపీ ఎన్నికల్లో పోటీ చేసిన సినీ తారలలో నందమూరి బాలకృష్ణ హిందూపురం నుంచి, చిరంజీవి తమ్ముడు నాగబాబు నర్సాపురం లోక్ సభ నియోజకవర్గం నుంచి, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గాజువాక, భీమవరం నుంచి బరిలో ఉన్నారు.అలాగే వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్యెల్యే రోజా, బీజేపీ నుంచి హీరోయిన్ మాధవీలత పోటీ చేశారు.
అయితే సినీ గ్లామర్ తో గట్టెక్కుతారు అనే నమ్మకం మాత్రం వీరిలో ఏవారికీ లేదు.ఇందులో రోజా గురించి చర్చిస్తే రాజకీయ నాయకురాలుగా ఆమె చేసిన అలుపెరగని పోరాటమే ఆమె గెలుపుకి బాటలు వేస్తుంది తప్ప సినీ నేపధ్యం ఆమెకు ఏమీ కలిసి రాలేదు.
ఇక నటరత్న బాలకృష్ణ విషయానికి వస్తే అనంతపురం జిల్లా హిందూపురం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సిట్టింగ్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తన గెలుపుపై అనుమానం వ్యక్తం చేస్తున్నాడట.ప్రచారంలో భాగంగా ఒకరిద్దరు అభిమానులు మెజారిటీ లక్ష దాటుతుంది అంటూ చేసిన వ్యాఖ్యలపై బాలకృష్ణ ఫైర్ అవ్వడం వైరల్ అయ్యిన సంగతి తెలిసిందే.అలాగే రెండు నియోజకవర్గాలలో పోటీ చేసిన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రెండు చోట్లా విజయం సాధించే అవకాశాలు లేవని అంచనా వేస్తున్నారు.భీమవరంలో గెలిస్తే రాజీనామా చేస్తాడని అక్కడి ఓటర్లు.
గాజువాక లో గెలిస్తే పవన్ కళ్యాణ్ సొంత గ్రామం ఉన్న భీమవరం నియోజకవర్గానికి వెళ్తారని గాజువాక ఓటర్లు భావించారని, అందుకే రెండు చోట్లా పవన్ కి గెలుపు ధీమా రాలేనట్టు తెలుస్తోంది.నరసాపురం పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసిన పవన్ అన్నయ్య నాగబాబు గెలుపు పరిస్థితి కూడా అంతంతమాత్రంగానే ఉన్నట్టు తెలుస్తోంది.