టాలీవుడ్కు మొన్నటి వరకు పెద్ద దిక్కు దాసరి నారాయణ రావు అనేవారు.ఏ చిన్న సమస్య వచ్చినా వివాదం వచ్చినా కూడా అందరు ఆయన వద్దకు పరుగు పెట్టే వారు.
ప్రభుత్వంతో మాట్లాడాలి అన్నా లేదంటే ఇండస్ట్రీలో ఒకరితో మరొకరు మాట్లాడాలన్నా కూడా ఆయనే పెద్దరికం చేసేవాడు.కాని దాసరి మృతి చెందిన తర్వాత టాలీవుడ్ పెద్ద ఎవరు లేరని ఇండస్ట్రీ అనాధగా మారిందని అంతా అనుకున్నారు.
కాని ఆయన స్థానంను చిరంజీవి నెత్తిన ఎత్తుకున్నారు. మా వివాదం పెద్ద ఎత్తున ఎగసి పడ్డ సమయంలో తనదైన శైలిలో స్పందించి దాన్ని సర్దుమనిగేలా చేశాడు.
అదే సమయంలో పలు సమస్యలను కూడా చిరంజీవి చర్చల ద్వారా పరిష్కరించేందుకు ప్రయత్నాలు చేశాడు.ఇక ఈ విపత్తు సమయంలో ఇండస్ట్రీలోని కార్మికులు ఆకలి చావులకు గురి కాకూడదు అనే ఉద్దేశ్యంతో ప్రతి ఒక్కరికి కూడా నిత్యావసరాలను సరఫరా చేయడం జరిగింది.
ఇక షూటింగ్స్ విషయంలో మాట్లాడేందుకు మళ్లీ చిరంజీవి నేడు ముందుకు వచ్చారు.
నేడు దాదాపు 10 మంది సినీ ప్రముఖులు చిరంజీవితో ఆయన ఇంట్లో భేటీ కాబోతున్నారు.ఈ భేటీలో భవిష్యత్తులో ఏం చేయాలి, ఈ విపత్తు సమయంలో షూటింగ్స్ ఎలా చేసుకోవాలి ప్రభుత్వం నుండి ఎలాంటి అనుమతులు తీసుకోవాలి, నిర్మాతలు, హీరోలు, ఇతర టీం ఎలా వ్యవహరించాలి, ఆర్థికపరమైన విషయాలను కూడా చర్చించబోతున్నట్లుగా తెలుస్తోంది.మొత్తానికి చిరంజీవి తనకు అప్పగించిన పెద్దరికంను సరిగ్గానే నిలబెట్టుకుంటున్నట్లుగా అనిపిస్తుంది.