ఏపీలో ఎప్పుడూ లేని విధంగా దర్యాప్తు సంస్థల హడావుడి ఎక్కువగా ఉంది.సిఐడి, ఈడి, ఐటి శాఖలు నిత్యం ఏపీలో హడావుడి చేస్తూ రాజకీయ నాయకులను బెంబేలెత్తిస్తు వార్తల్లోకి ఎక్కుతున్నాయి.
నాయకుల అక్రమాలను తవ్వి తీస్తూ, సంచలనాలు సృష్టిస్తున్నాయి.ఇలా ఒకేసారి ఈ మూడు సంస్థలు సమన్వయంతో ముందుకు వెళుతూ , కొంతమంది రాజకీయ నాయకులు, పార్టీ నాయకుల అక్రమాల చిట్టాలు బయటకి తీసేందుకు ప్రయత్నిస్తూ ఉండటం హాట్ టాపిక్ గా మారింది.
ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులను భయబ్రాంతులకు గురి చేసే విధంగా ఈ దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగడంతో ఆ పార్టీ నాయకుల్లో కలవరం పుట్టిస్తోంది.ఏపీలో టీడీపీ నేతల ఇళ్లు, ఆఫీసులపై దాడులు నిర్వహిస్తునే ,మరో పక్క అమరావతిలో భూములు ఇన్సైడర్ ట్రేడింగ్ పై సిఐడి కేసులు నమోదు చేసుకుంటూ వెళుతోంది.
ఈ విషయంలో ఐటీ శాఖ కూడా భాగస్వామ్యం అవుతూ అందరూ కలిసికట్టుగా టిడిపి నాయకులను టార్గెట్ చేసుకోవడంతో ఆ పార్టీలో తీవ్ర ఆందోళన నెలకొంది.ఏపీ దర్యాప్తు సంస్థలతో పాటు, జాతీయ దర్యాప్తు సంస్థలు కూడా ఈ విధంగా రంగంలోకి దిగాయి అనే ఆందోళన టిడిపి నాయకుల్లో ఎక్కువగా కనిపిస్తోంది.
ఏపీలో వైసీపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని, చంద్రబాబు ఆ పార్టీ నాయకులు విమర్శలు చేస్తున్నా, జాతీయ దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగడం, కేంద్ర అధికార పార్టీ బిజెపి హస్తం కూడా ఈ విషయంలో ఉన్నట్టు తేలడంతో టీడీపీ కంగారుపడుతోంది.నేరుగా బీజేపీని విమర్శించకుండా కేవలం ఏపీ ప్రభుత్వం పై టిడిపి విమర్శలు చేస్తూ వస్తోంది.
దీంతో నాయకులు ఒక్కొక్కరుగా పార్టీని వీడేందుకు సిద్దమవుతూ ఉండడంతో దీనికి ఏ విధంగా అడ్డుకట్ట వేయాలి అనే దానిపై టిడిపి అధినేత చంద్రబాబు ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది.
టిడిపిలో ఉన్న నాయకులు ఇదే రకమైన భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.ఈ తరహా రాజకీయాలు గతంలో ఎప్పుడు చోటు చేసుకోకపోవడంతో ఆందోళన మరింతగా పెరిగిపోతోంది.తెలుగుదేశం పార్టీని ఏపీలో లేకుండా చేసేందుకు జగన్ కు బీజేపీ కూడా సహకరిస్తోందనే అనుమానాలు టిడిపిలో బలంగా ఉన్నాయి.
ముఖ్యంగా చంద్రబాబుకు అత్యంత సన్నిహితులుగా ఉన్న నాయకులు, బినామీలు పేరుపడిన వ్యక్తులను టార్గెట్ చేసుకుంటూ దర్యాప్తు సంస్థలు ముందుకు వెళ్తున్నాయి.
ఏపీ, తెలంగాణలో ఏకకాలంలో ఢిల్లీ ఐటీ బృందాలు దాడులు చేస్తున్నారు.
తాజాగా చంద్రబాబు మాజీ పీఏ శ్రీనివాస్ ఇంట్లో విజయవాడ, హైదరాబాద్ లో ఆయన ఆస్తుల పైన ఐటీ సోదాలు నిర్వహించాయి.విజయవాడ గాయత్రి నగర్ లో ఉన్న బ్యాంకు లాకర్ నుంచి కీలక పత్రాలను కూడా స్వాధీనం చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఈ పత్రాలలో టీడీపీకి చెందిన ముఖ్య నేతలకు ఇచ్చిన 150 కోట్ల ముడుపులకు సంబంధించి లెక్కలు కూడా సమగ్రంగా ఉన్నట్లు తెలుస్తోంది.అక్రమాల పుట్ట ను నిరంతరం తవ్వి తీసేందుకు ప్రయత్నాలు చేస్తుండడంతో ఆ భయంతో నాయకులు ఎవరు టిడిపిలో ఉండే పరిస్థితి కనిపించకపోవడం చంద్రబాబులో ఆందోళన పెంచుతున్నట్టు గా కనిపిస్తోంది.